'జేసీ జోకర్.. వైఎస్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వా విమర్శించేది'
కడప: మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో పాటు పరోక్షంగా హత్యా రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. తాత రాజారెడ్డి లాగే జగన్ లోనూ క్రూరత్వం ఉందని జేసీ విమర్శించారు.
మహానాడులో జెసి హల్ చల్...చంద్రబాబుకే ఆదేశాలు...సిఎం బోల్తా పడ్డారు
ఈ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ జేసీకి కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఆ పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి దీనిపై స్పందించారు. వైఎస్ కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు జోకర్ లాంటి జేసీతో విమర్శల దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ.. ఇప్పుడు ఆ మహా నేతనే విమర్శించడం సరికాదన్నారు.
ప్రజలు జేసీ తీరును ఇక సహించరని, ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలను మహానాడులో ఎందుకు ప్రస్తావించ లేదని శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జేసీకి ఓటమి తప్పదని అన్నారు. టీడీపీ, బీజేపీలు రెండూ మూకుమ్మడిగా రాష్ట్రాన్ని మోసం చేశాయని రాచమల్లు ఆరోపించారు.