చెప్పేది చెగువేరా సిద్దాంతాలు.. చేసేది పెయిడ్ ఆర్టిస్ట్ రాజకీయాలు : పవన్పై వైసీపీ విమర్శలు
పవన్ తన స్వార్థ రాజకీయాల కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. చేగువేరా సిద్దాంతాలను అనుసరిస్తానని చెప్తూ.. ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. రాజకీయాల్లోకి పవన్ పెయిడ్ ఆర్టిస్టుగా వచ్చారని.. పెయిడ్ ఆర్టిస్టు గానే కొనసాగుతున్నారని ఆరోపించారు. పవన్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని, పవన్ లాంటి నేతతో పొత్తుపై బీజేపీ పునరాలోచించుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ బీజేపీని తీవ్రంగా విమర్శించారని.. అవన్నీ మర్చిపోయి ఆ పార్టీ జనసేనతో ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. చంద్రబాబు అనాలోచితంగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే.. పవన్ ఎందుకని ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను విశాఖలోనే నిర్మించాలని కోరారు.
ఇక వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ... ఎవరు ఎవరితో కలిసినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. అసలు జనసేనను పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతుందన్నారు. దేశంలో,రాష్ట్రంలో కమ్యూనిస్టులు పోరాడినంతగా ఇతర పార్టీలు పోరాడలేవని.. అలాంటి పార్టీలను వదిలిన ఘనుడు పవన్ అని విమర్శించారు. బీజేపీతో కలిసి పోరాడుతామని పవన్ చెప్పడం కామెడీ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీని విమర్శించి.. ఇప్పుడు మళ్లీ ఏవిధంగా వారితో చేతులు కలిపారంటూ ప్రశ్నించారు.
చేగువేరా స్ఫూర్తి అని చెప్పుకునే పవన్.. బీజేపీ లాంటి ఫాసిస్టు పార్టీతో ఎలా జతగట్టారని నిలదీశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా చీకటి రోజు అని.. పవన్ కల్యాణ్ వల్ల యువత మోసపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ,బీజేపీలతో పొత్తు,2019లో వామపక్షాలు,బీఎస్పీతో పొత్తు.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు అని మండిపడ్డారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ నాయకత్వంతో విభేదించడంతో ఏం చేయాలో పవన్కు దిక్కు తోచట్లేదని విమర్శించారు. పొత్తుల మీద ఉన్న ధ్యాస పార్టీ నిర్మాణంపై లేదని.. స్థిరత్వం లేని ఆయన మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు.