టీడీపీతో టీటీడీకి అవమానం: లక్ష్మీపార్వతి ఆగ్రహం
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వేంకటేశ్వరస్వామి ఆభరణాల అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు.
టీటీడీ అధికారుల సమక్షంలో నగల పరిశీలన అంటున్నారని, అది టీటీడీ కాదు.. టీడీపీ పాలక కమిటీ అని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఒకవేళ ఈ విధంగా నగల పరిశీలన జరిగితే న్యాయం జరగదన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను సైతం కాజేసిన వారు పరిశీలన కమిటీ ఉన్నారని, ఇది దేవస్థానం వారికే అవమానమని లక్ష్మీపార్వతి అన్నారు.
కేరళలో పద్మనాభస్వామి ఆలయంలో వేసిన జ్యూడీషియల్ కమిటీలా.. ఇక్కడ కూడా నగల పరిశీలనకు కమిటీ వేస్తే తప్ప న్యాయం జరగదని అన్నారు. ఇది ఇలా ఉంటే, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని మొదట టీటీడీ భావించినప్పటికీ.. ఇందుకు ఆగమసలహా మండలి సభ్యులు అభ్యంతరం తెలిపారు.
శ్రీవారి ఆభరణాల ప్రదర్శనను ఆగమసలహాదారు సందురవదన భట్టాచర్య తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవని, వాటికి విలువ కట్టలేమని ఆయన అన్నారు. ఆభరణాలు ప్రదర్శిస్తే.. వాటి భద్రత బాధ్యత ఎవరిదని ఆయన నిలదీశారు. అయితే, టీటీడీ అధికారులు చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.