2024లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేల్చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్: ఆయనకే అడ్వాంటేజ్
అమరావతి: రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారింది.
అధికారంలోకి వచ్చేది వైసీపీనే..
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైఎస్ఆర్సీపీనేనని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఉన్న పథకాలను వైఎస్ జగన్.. 2024 ఎన్నికల వరకూ తీసుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వైఎస్ జగన్ పరిపాలన సాగుతోందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో ప్రజలను ఆయన ఆర్థికంగా ఆదుకోగలిగారని అన్నారు.
ఆర్థిక వేత్తల సూత్రాన్ని అనుసరించిన వైఎస్ జగన్
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కాలంలో ఏదో ఒక రూపంలో ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయట పడటానికి ప్రజలకు ఆర్థికంగా చేయూతను అందించాల్సి ఉంటుందని ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న ఆమర్త్యసేన్, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు..మళ్లీ ప్రభుత్వానికే..
పేద ప్రజల బ్యాంక్ అకౌంట్లల్లో డబ్బులు వేయాలని, అది మళ్లీ తిరిగి మార్కెట్లోకే వస్తుందనేది ఆర్థికవేత్తల అభిప్రాయమని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. కరోనా సమయంలో ఏపీలో ఇదే జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సూత్రాన్ని వైఎస్ జగన్ పక్కాగా, పకడ్బందీగా అమలు చేశారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ వివిధ పథకాల కింద పేద ప్రజల అకౌంట్లల్లో డబ్బులు వేశారని, అది మళ్లీ మార్కెట్లో రొటేషన్ అయిందని చెప్పారు. అలా మార్కెట్లో డబ్బులు రొటేషన్ కావడం వల్ల చివరికి జీడీపీ కూడా స్థిరంగా నిలిచిందని అన్నారు.
పేదల ఆర్థిక పరిస్థితి దిగజారకుండా..
డబ్బులు వేయకుండా ఉండి ఉంటే జీడీపీ క్షీణించి ఉండేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అంచనా వేశారు. కారణాలు ఏవైనప్పటికీ- వైఎస్ జగన్.. మార్కెట్లో డబ్బులు రొటేట్ అయ్యేలా చేశారని చెప్పుకొచ్చారు. నవరత్నాల పేరుతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారి బ్యాంక్ అకౌంట్లల్లో డబ్బులు వేశారని, ఫలితంగా- అదంతా మళ్లీ మార్కెట్లోకే వచ్చిందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేద కుటుంబీల పరిస్థితి దిగజారాల్సినంతగా దిగజారలేదని అన్నారు. పేదల ఆర్థిక పరిస్థితి దిగజారిపోకుండా వైఎస్ జగన్ ఆపగలిగారని విశ్లేషించారు.
Recommended Video
జగన్కు వరం..మోడీకి శాపం..
కరోనా వైరస్ అనేది వైఎస్ జగన్కు వరంలాంటిదని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన ఆర్థిక నిర్వహణ ఎంత శక్తిమంతమైనదో..పటిష్టమైనదో కరోనా సంక్షోభ కాలం స్పష్టం చేసిందని అన్నారు. అదే కరోనా స్థితిగతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శాపంగా మారాయని చెప్పారు. కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి ప్రజలను ఒడ్డెక్కించడం వల్ల వైఎస్ జగన్ ఇమేజ్ పెరిగిందని, అవే పరిస్థితులు మోడీ ఇమేజ్ తగ్గడానికి కారణం అయ్యాయని చెప్పారు. తొలి వేవ్ తరువాత నరేంద్ర మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని అన్నారు. కరోనా పరిస్థితులనేవి వైఎస్ జగన్కు అడ్వాంటేజ్ అని.. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతకన్నా ఇంకేమీ చేయలేరని అన్నారు.