విగ్రహాల రాజకీయానికి వైసీపీ కౌంటర్- కేంద్రాన్ని ఇరికిస్తూ- పీకే సలహాతోనే ?
ఏపీలో వరుసగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న ముప్పేట దాడికి వైసీపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. బీజేపీ విమర్శలపై మౌనంగా ఉంటే త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్న వైసీపీ.. కేంద్రాన్ని అడ్డుపెట్టి మరీ ఏపీలో కాషాయ నేతలకు కళ్లెం వేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా కేంద్రాన్ని సైతం డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ కౌంటర్ ఎటాక్పై కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దానిపైనే ఏపీలో భవిష్యత్ రాజకీయం ఆధారపడనుంది.
విగ్రహాల రాజకీయానికి వైసీపీ కౌంటర్
ఏపీలో విగ్రహాల ఘటలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ అప్రమత్తమైంది. ముఖ్యంగా విగ్రహాల ఘటనలపై వరుసగా కేసులు నమోదవుతున్నా, నిందితుల పేర్లు సైతం బయటికొస్తున్నా ఇంకా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దీటుగా స్పందంచాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో బీజేపీ టార్గెట్గా కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ముందుగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తోనే ఈ కౌంటర్లు వేయిస్తోంది. ఇందులోనూ కేంద్రాన్ని లాగుతోంది. తద్వారా ఏపీ బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది తిరుపతి ఉపఎన్నికల ఫలితం తేల్చబోతోంది.
అంతర్వేదిలోకి కేంద్రాన్ని లాగుతూ
అంతర్వేదిలో గతేడాది రథం దగ్ధం ఘటన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేసింది. అంతర్వేదికి యాత్రల పేరుతో రాజకీయాల్ని వేడెక్కించింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన వైసీపీ సర్కారు అంతర్వేది రధం దగ్ధంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని కోరుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఇది జరిగి మూడు నెలలు దాటిపోయినా ఇప్పటికీ కేంద్రం దీనిపై స్పందించలేదు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించలేదు. ఆ తర్వాత కూడా ఆలయాల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా పలుమార్లు దీనిపై ఆరా తీసినట్లు వార్తలొస్తున్నాయి. అయినా అంతర్వేదిపై మాత్రం కేంద్రం స్పందించలేదు. దీంతో ఆ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ బీజేపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.
కేంద్రాన్నీ, బీజేపీని డిఫెన్స్లోకి నెడుతూ
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట ప్రభుత్వం కోరి మూడు నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటివరకూ కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదొక్కటే కాదు ఏపీలో ఇప్పటివరకూ వైసీపీ సర్కారు కోరిన ఏ ఒక్క అంశంలోనూ కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వలేదు. అమరావతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోసం జగన్ కేంద్రంలో పెద్దలను కలిసి స్వయంగా కోరారు. అయినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. దీంతో అంతర్వేది వ్యవహారంలో సీబీఐ దర్యాప్తుకు మేం ఆదేశించినా కేంద్రం స్పందించలేదనే విషయాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్రంతో పాటు బీజేపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ రెడీ అయింది. వీరిద్దరిలో ఎవరిపై దీని ఒత్తిడి పడినా తమకే ప్రయోజనమని వైసీపీ అంచనా వేస్తోంది.
ప్రశాంత్ కిషోర్ సలహా మేరకేనా ?
తిరుపతిలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో లోక్సభ ఉపఎన్నిక అనివార్యమైంది. మార్చిలోగా ఈ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడం ఖాయం. ఇందుకోసమే ఏపీలో విగ్రహాల రాజకీయం చోటు చేసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బీజేపీ దూకుడు వెనుక కూడా తిరుపతిలో ప్రయోజనం పొందాలన్న ఆరాటమే ఉందని వైసీపీ అనుమానిస్తోంది. దీంతో ఇప్పటివరకూ మౌనంగా ఉన్నా... ఎన్నికల రాజకీయంలో భాగంగా కేంద్రంతో పాటు బీజేపీపైనా కౌంటర్ అటాక్కు వైసీపీ సిద్ధమవుతోంది. తాజాగా ప్రశాంత్ కిషోర్తో భేటీలోనూ విగ్రహాల అంశంపై వైసీపీ కౌంటర్ అటాక్ చేయడమే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది.