బీజేపీతో పొత్తు: మోడీ కేబినెట్లోకి వైసీపీ ఎంట్రీ? పొలిటికల్ సర్వే సంస్థ ఏం చెబుతోంది?
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కొద్దిరోజులు రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సీపీ.. ఎన్డీఏ కూటమిలో చేరడం కేవలం లాంఛనప్రాయమేనని, ఇప్పటికే అన్ని రకాల ఒప్పందాలు ఈ రెండు పార్టీల మధ్య కుదిరాయనే వార్తలూ వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంలో వైఎస్ఆర్సీపీకి ఒక కేబినెట్, రెండు సహాయమంత్రి బెర్తులు దక్కబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైఎస్ జగన్ హస్తిన విమానం ఎక్కే వేళ.. దీనిపై చర్చ మరింత తీవ్రమైంది.
ప్రధాని ఆహ్వానంపై వైసీపీ నిర్ణయం ఏంటీ..
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్సేపట్లో హస్తినకు బయలుదేరి వెళ్లబోతోండటం.. మంగళవారం ఆయన ప్రధానమంత్రితో భేటీ కానుండటం.. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా.. వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారనీ చెబుతున్నారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలకు పుల్స్టాప్ పెట్టింది వీడీపీ అసోసియేట్స్. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, రాజకీయ విశ్లేషణ, పోలింగ్ ఏజెన్సీ ఇది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, దేశ రాజకీయ వ్యవహారాలపై సర్వేలను నిర్వహిస్తుంటుంది.
పవర్ఫుల్ కేబినెట్ బెర్తులను ఆఫర్ చేసినా..
ఎన్డీఏలో చేరాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. వైసీపీని ఆహ్వానించిన విషయం నిజమేనని, ఈ ఆహ్వానాన్ని వైఎస్ జగన్ తోసిపుచ్చడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిందా సంస్థ. కేబినెట్లో అత్యంత శక్తిమంతమైన, కీలకమైన మంత్రిత్వ శాఖలను అప్పగిస్తామంటూ ప్రధానమంత్రి ఆఫర్ ఇచ్చినప్పటికీ.. వైఎస్ జగన్ దాన్ని తోసిపుచ్చడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీడీపీ అసోసియేట్స్ అంచనా వేసింది. కొందరు వైఎస్ఆర్సీపీకి చెందిన టాప్ కేడర్ నేతల అభిప్రాయాలను తీసుకున్న తరువాతే.. తాము ఈ అంచనా వేసినట్లు పేర్కొంది.
ప్రత్యేక హోదా మెలిక.. లేదా ఫైనాన్షియల్ బెయిల్ అవుట్
ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్సీపీ చేరుతుందా? లేదా? అనే నిర్ణయాన్ని ప్రత్యేక హోదా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు వెల్లడించిందా సంస్థ. ప్రత్యేక హోదాను ఇవ్వడానికి ప్రధాని అంగీకరిస్తే.. బేషరతుగా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ అంగీకరించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలనే మెలికను వైఎస్ జగన్ ప్రధానమంత్రి ముందు ఉంచడం ఖాయంగా భావిస్తున్నామని పేర్కొంది. దానికి ఆయన అంగీకరించితే.. వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ లో చేరడం లాంఛన ప్రాయమే అవుతుందని స్పష్టం చేసింది. హోదా కుదరకపోతే.. రాష్ట్రానికి ఫైనాన్షియల్ బెయిల్ అవుట్ను డిమాండ్ చేయొచ్చనీ అంచనా వేసింది.
Recommended Video
ఎన్డీఏకు అత్యవసరం..
దేశ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. మొన్నటికి మొన్న అకాలీదళ్ ఈ కూటమికి గుడ్బై చెప్పింది. అంతకుముందు- శివసేన, ఆ తరువాత రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగాయి. ఈ లోటును భర్తీ చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులపై వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం.. ఎన్డీఏకు దగ్గరవుతోందనే సంకేతాలను ఇచ్చింది.