అందుకే నారావారిపల్లెలో వికేంద్రీకరణ సభ: చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్, పసుపు నీళ్లు చల్లిన టీడీపీ
చిత్తూరు: అమరావతిలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసేకంటే.. రాయలసీమ ప్రజలు కోరుతున్న నీళ్లను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాసదస్సును ఆదివారం నిర్వహించింది. నారావారిపల్లె.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం కావడం గమనార్హం.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి: చెవిరెడ్డి..
ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు కన్నబాబు, నారాయణస్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..అధికార వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.
అందుకే నారావారిపల్లెలో సభ.. జగన్ దమ్మున్న నాయకుడు
నారావారిపల్లె పరిసర ప్రాంతాల్లో రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెవిరెడ్డి చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని అన్నారు. సీఎం వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడని, ధైర్యంగానిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలంతా స్వాగతిస్తున్నారని అన్నారు. నారావారిపల్లెలో సభ ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని.. ఇక్కడి ఎమ్మెల్యేగా అంతరాన్ని దూరం చేయడానికే సభ పెట్టానని తెలిపారు.
అధికారం కోసమే చంద్రబాబు రాజకీయాలు
అజేయకల్లం మాట్లాడుతూ.. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ సీఎం లక్ష్యమన్నారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వ్యక్తి జగన్ అని అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడని కొనియాడారు. కేవలం అధికారం కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పసుపు నీళ్లతో పవిత్రం చేశామంటూ టీడీపీ
కాగా, అంతకుముందు వైసీపీ, టీడీపీ నేతలు నారావారిపల్లెలో పోటీపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ వికేంద్రీకరణ సభను చంద్రబాబు స్వగ్రామంలో పెట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ నేతల కార్యక్రమాల నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో నారావారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, వైసీపీ సభ నిర్వహించిన స్థలంలో టీడీపీ నేతలు పసుపు నీళ్లు చల్లారు. వైసీపీ సభతో ఈ స్థలం అపవిత్రం అయ్యిందని, అందుకే పసుపు నీళ్లు చల్లి.. పవిత్రం చేశామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.