ఎమ్మెల్యే బాలయ్య మిస్సింగ్!?: హిందూపురం వన్ టౌన్లో ఫిర్యాదు..
బాలకృష్ణకు సినిమాలపై ఉన్నంత శ్రద్ధ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై లేదని, అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారని ఫిర్యాదులో వైసీపీ నేతలు పేర్కొన్నారు.
హిందూపురం: ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నప్పటికీ.. రాజకీయాల కన్నా సినిమాలకే పెద్ద పీఠ వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడపా దడపా ఎప్పుడో ఒకసారి తప్పించి నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఫలితంగా సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరు పరిష్కరిస్తారో తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్షం వైసీపీ.. ఎమ్మెల్యే బాలకృష్ణ తీరును ఎండగడుతూ.. కనిపించకుండా పోయారని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలకృష్ణకు సినిమాలపై ఉన్నంత శ్రద్ధ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై లేదని, అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారని ఫిర్యాదులో వైసీపీ నేతలు పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు.
మరోవైపు వైసీపీ ఆరోపణలను స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు. హిందూపురంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.