త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలు
అమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్నారు. అమరావతి పెద్ద స్కామ్ అని తాము ముందునుంచి చెప్తున్నామని, బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని రాంబాబు తెలిపారు.. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందని, త్వరలోనే ఈ భారీ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని అంబటి తెలిపారు.
రాజధాని భూముల స్కామ్పై సీబీఐ విచారణ వేయాలని కేంద్రాన్ని కోరామని, టీడీపీ తప్పు చెయ్యకపోతే సీబీఐ విచారణ కోరాలని అంబటి రాంబాబు సూచించారు. తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదన్నారు. అలాగే ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్కు పాల్పడ్డారని అంబటి తెలిపారు.. ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలన్నారు. ఈ రెండు కేసులూ తీవ్రమైనవని అంబటి పేర్కొన్నారు. వీటిపై సీబీఐ విచారణ తప్పనిసరన్నారు. 24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టేనని అంబటి వ్యాఖ్యానించారు.
హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి స్పందించారు. డీజీపీపై హైకోర్ట్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. న్యాయస్థానాలపై తమకు ఎంతో గౌరవం ఉందని, హైకోర్టు కామెంట్స్పై సమాధానం చెప్పలేమన్నారు. కేవలం హైకోర్టు ఉత్తర్వులపై మాత్రం స్పందిస్తామన్నారు.