భళారే భువనేశ్వరి.. మీ గురించి చెప్పుకోవాల్సిందే.. అంబటి సంచలన వ్యాఖ్యలు
అమరావతిలో బినామీల పేరుతో అక్రమంగా కొన్న వేల ఎకరాల భూముల కోసమే నారా కుటుంబం రాజధాని విషయంలో డ్రామాలాడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. రైతుల్ని తప్పుదోవపట్టిస్తూ, అమరావతి వివాదాన్ని పెద్దది చెయ్యాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్ కలిసి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనుకూల మీడియాలో ప్రతిరోజూ 'రాజధాని రగిలిపోతోంది', 'ఉద్యమం ఎగిసిపడుతోంది' అంటూ తప్పుడు వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతి రైతులతో భువనేశ్వరి: చేతి గాజు విరాళంగా ఇచ్చి, అండగా ఉంటామని భరోసా
ఆమెకు రైతులంటే ఎందుకింత జాలి?
భర్త చంద్రబాబుతో కలిసి బుధవారం రాజధాని రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన భువనేశ్వరి.. తన చేతికున్న ప్లాటినం గాజుల్ని తీసి.. ఉద్యమానికి విరాళంగా ఇవ్వడంవెనుక అసలు మతలబు వేరే ఉందని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నడూ లేనిది భువనేశ్వరికి రైతుల పట్ల జాలి కలగడం, ఉద్యమాల పట్ల ప్రేమ పొంగుకురావడం విచిత్రంగా ఉందన్నారు. ‘‘చంద్రబాబు అధికారంలో ఉన్నన్నినాళ్లూ కొన్ని వేల మంది రైతులు, పేదలు పిట్టల్లా రాలిపోయినా ఆమె పట్టించుకోలేదు. గోదావరి పుష్కరాల్లో బాబు ఫ్యామిలీ సినిమా షూటింగ్ వల్ల 30 మంది చనిపోయిన రోజు కూడా భువనేశ్వరి చలించలేదు. ఆఖరికి కన్న తండ్రి ఎన్డీఆర్ కన్నీళ్లు పెట్టుకుని.. ఊరూరా తిరుగుతూ చంద్రబాబు దుర్మార్గాల్ని బయటపెట్టినరోజు కూడా ఆమెకు జాలి కలగలేదు''అని గుర్తుచేశారు.
శభాష్.. మీలాంటి భార్యలు గొప్పోళ్లు..
రాష్ట్ర విభజన టైమ్ లో సమైక్యత కోసం జరిగిన ఉద్యమంలో చాలా మంది చనిపోయిన సందర్భంలోనూ బాధను వ్యక్తం చేయని భువనేశ్వరికి సడెన్ గా రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చిందటే ఎవరు నమ్మాలి? ఇది రైతుల మీద ప్రేమా? లేక భర్త, కొడుకు కొనిపెట్టుకున్న భూములపైన ప్రేమా? అని అంబటి ప్రశ్నించారు. ‘‘భళారే.. ఎంత విచిత్రం.. భువనేశ్వరికి భూములంటే ఎంత ప్రాణం.. కొడుకు, భర్త కొన్న భూముల కోసం దేనికైనా తెగించడానికి సిద్ధమయ్యారే.. శభాష్.. మీలాంటి భార్యల గురించి గొప్పగా చెప్పుకోవాలి''అని అంబటి సెటైర్ వేశారు.
బాబు చంపేస్తాడు..
కుటిల రాజకీయాలకు మారుపేరైన చంద్రాబాబు నాయుడు.. రాజధాని రైతుల విషయంలో కొత్త కుట్రలకు తెరతీస్తున్నారన్న అంబటి.. బాబు విషయంలో రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘ఈ మధ్యే చూశాం.. మెర్సీ కిల్లింగ్ కు అనుమతించాలంటూ రైతుల పేరుతో రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు వెళ్లాయి. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు.. రాజధానిలో రైతుల్ని చంపేసి.. వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రమాదం లేకపోలేదు. లేదా సాధారణ మరణాలను కూడా అమరావతి కోటాలో వేసి ధర్నాలకు దిగే అవకాశం కూడా ఉంది. సొంతలాభం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబును ఎవరూ నమ్మకండి''అని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.
ఇన్ సైడర్ ట్రేటింగ్ పై వీడియో..
రాజధాని విషయంలో చంద్రబాబు భయమంతా తాను కొన్న భూముల గురించే తప్ప రైతుల గురించి కానేకాదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నారు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో, చంద్రబాబు, లోకేశ్ బినామీలతోపాటు టీడీపీ నేతలు ఎవరెవరు ఎక్కడెక్కడ భూములు కొన్నారో అన్ని వివరాలు పొందుపర్చిన వీడియోను అంబటి మీడియాకు ప్రదర్శించారు. మొత్తం 21 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని, దీనిపై స్టడీ చేయాలని అంబటి కోరారు.