జస్టిస్ కనగరాజ్ నియామకంపై అంబటి కీలక వ్యాఖ్యలు.. బాబుపై ఫైర్..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నియమితులైన జస్టిస్ కనగరాజ్ గతంలో సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేశారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల కమిషనర్ స్థానంలో ఒక న్యాయ కోవిదుడు ఉంటే చట్టాలను పటిష్టంగా అమలుచేస్తారని అబిప్రాయపడ్డారు. ఎన్నికల వ్యవస్థ బలోపేతానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.జస్టిస్ కనగరాజ్ గతంలో మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేశారని.. మొత్తం 9 ఏళ్లు న్యాయమూర్తిగా చేశారని చెప్పారు. ఆ సమయంలో అనేక కీలక తీర్పులు ఇచ్చారని.. వాటిని ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా అనుసరించాయని తెలిపారు.
సామాన్య దళిత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కనగరాజ్ హైకోర్టు జడ్జిగా ఎదగడాన్ని ప్రశంసించారు. ప్రభుత్వ నిర్ణయంపై చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారని... దళితుడు, న్యాయకోవిదుడు ఎస్ఈసీ స్థానానికి పనికిరారా? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ ఒక్కరే ఆ స్థానానికి పనికొస్తారా? అని నిలదీశారు. దళితులను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే టెర్రరిస్టు రాజ్యమని యనమల రామకృష్ణుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేయడానికి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే సరైందని చాలామంది అభిప్రాయపడుతున్నట్టుగా చెప్పారు.
గత చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉండేలా చట్టం ఉందని.. కానీ ప్రభుత్వాలతో,రాజకీయ నాయకులతో దగ్గరగా పనిచేసినవారి కంటే.. న్యాయ కోవిదులను అందులో నియమిస్తే ఆ పదవికి న్యాయం జరుగుతుందన్నారు.కాగా,పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్ 200ని ప్రభుత్వం మార్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసిపయినట్టయింది. ఇక కొత్తగా నియమితులైన జస్టిస్ కనగరాజ్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.