విగ్రహాల విధ్వంసానికి కారణమేంటో వెల్లడించిన రోజా: ప్రధాని, ఉప రాష్ట్రపతి కూడా: ఎప్పుడూ ఏడుపే
అమరావతి: రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటోన్న విగ్రహాల విధ్వంసం, దేవాలయాలపై దాడుల నేపథ్యంలో వెల్లువెత్తుతోన్న రాజకీయ విమర్శలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకపోతున్నారని, అందుకే వాటి మీది నుంచి దృష్టి మరల్చడానికి ప్రతిపక్ష నేతలే విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్నారని ప్రత్యారోపణలు చేస్తున్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందటాన్ని, ప్రజలు సంతోషంగా ఉండటాన్ని చూసి ప్రతిపక్ష నేతలు భరించలేకపోతున్నారని, వారిది ఎప్పుడు ఏడుపు మొఖమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల ముఖాల్లో వెలిగిపోతోన్న సంతోషాలు, చిరునవ్వులను తెలుగుదేశం పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కిందటి నెల 25వ తేదీ నుంచే సంక్రాంతి సందడి మొదలైందని, ఇళ్ల పట్టాల పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోందని అన్నారు.
మహిళల పేరు మీద పట్టాలను ఇవ్వడమే కాకుండా.. వారికి ఉచితంగా ఇళ్లను కట్టివ్వడం ద్వారా సమాజంలో వారి పట్ల గౌరవాన్ని కల్పించారని, చిరకాలం నిలిచిపోయేలా ఆస్తిని ఇచ్చారని రోజా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ చేస్తోన్న కార్యక్రమాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు మాత్రం ఏడుపు మొఖంతో కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రతీసారీ.. దాన్ని దారి మళ్లించడానికి ప్రతిపక్షాలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల ప్రారంభ కార్యక్రమాల తేదీలు సమీపిస్తున్నప్పుడే విగ్రహాల విధ్వంసం సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.