పవన్ కల్యాణ్కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలు
అమరావతి: ప్రకాశం జిల్లా సింగరపల్లిలోో జనసేన పార్టీ కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా రాంబాబు స్పందించారు. వెంగయ్య నాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ తనను విమర్శించడం అర్థం లేదని అన్నారు. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Recommended Video
అప్పుడెందుకు ప్రశ్నించలేదు..
తాను దూషించడం వల్లే వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకోలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు పదే పదే చెబుతోన్నా పవన్ కల్యాణ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తొత్తుగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో దారుణాలు, ఆకృత్యాలు చోటు చేసుకున్నప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వనజాక్షి ఉదంతంలో గానీ, నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు గానీ పవన్ కల్యాణ్ ఎందుకు బయటికి రాలేదని అన్నారు.
చిరంజీవి ఆశీర్వాదంతోనే..
తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు అడ్డంగా కొనుగోలు చేసిన సమయంలో పవన్ కల్యాణ్కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవిని రాజకీయ గురువుగా గౌరవిస్తానని అన్నా రాంబాబు అన్నారు. 2009లో తాను ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచానని, దానికి కారణం చిరంజీవేనని చెప్పారు. తాను ఏనాడూ చిరంజీవిని అగౌరవ పర్చలేదని, ఆయన ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో ఎదిగానని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి అసెంబ్లీలో ఒక్క సీటు వస్తేనే.. ఇంత అరాచకం చేస్తోంటే.. ఇక మెజారిటీ లభిస్తే ఇంకెంత దారుణాలకు పాల్పడతారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టులో లొంగిపోతా..
వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకోవడంలో తాను గానీ, తన అనుచరులు గానీ, వైసీపీ కార్యకర్తల ప్రమేయం గానీ ఉన్నట్లు నిరూపించగలిగితే.. స్వచ్ఛందంగా న్యాయస్థానంలో లొంగిపోతానని అన్నా రాంబాబు సవాల్ చేశారు. ఈ సవాల్ను పవన్ కల్యాణ్ స్వీకరించగలరా? అని ప్రశ్నించారు. వెంగయ్య నాయుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులే చెప్పారని గుర్తు చేశారు. ఆ కుటుంబంపై పవన్ కల్యాణ్కు నమ్మకం లేకపోతే.. వారికి నార్కొటిక్స్ పరీక్షలు చేయించుకోవచ్చని చెప్పారు.
తన ప్రమేయం ఉన్నట్లు తేలితే..
వెంగయ్య నాయుడి ఆత్మహత్యలతో తన ప్రమేయం ఉన్నట్లు తేలితే.. రాజీనామా చేస్తానని అన్నా రాంబాబు అన్నారు. తాను ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేయడానికీ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనపై పవన్ కల్యాణ్ పోటీకి సై అనగలరా? అని ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ గెలిస్తే.. తాను న్యాయస్థానంలో లొంగిపోతానని, విచారణ సైతం కోరబోనని అన్నారు. ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు. తాను గెలిస్తే.. తాను తప్పుడు ఆరోపణలు చేసినట్లు అంగీకరించి, ప్రజలకు క్షమాపణ చెబితే చాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తాను ప్రచారానికి పిలవబోనని, ఆయన బొమ్మ ఒక్కటే చాలని చెప్పారు.