రోజా ఆరోగ్యంపై ఆందోళన: సేఫ్గా ఉన్నానంటోన్న వైసీపీ ఫైర్బ్రాండ్: గన్మెన్కు పాజిటివ్తో
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా ఆరోగ్యంపై నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. దీనికి కారణం- ఆమె గన్మెన్ కరోనా వైరస్ బారిన పడటమే. రోజా గన్మెన్కు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో ఆయనను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా- రోజా కూడా కరోనా వైరస్ బారిన పడి ఉండొచ్చనే ఆందోళన ఆమె సొంత నియోజకవర్గం నగరిలో వ్యక్తమౌతోంది.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గన్మెన్కు నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వెంటనే ఆయనను స్విమ్స్కు తరలించారు. ఆయనతో కాంటాక్ట్లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. గన్మెన్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన సూచించిన వారి స్వాబ్లను సేకరించి, తిరుపతిలోనే పరీక్షిస్తున్నారు. తన గన్మెన్ కరోనా బారిన పడటం పట్ల రోజా స్పందించారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. తన కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు.
Recommended Video
అనారోగ్యానికి గురైన గన్మెన్ సుమారు 20 రోజులుగా విధులకు హాజరు కావట్లేదని రోజా తెలిపారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించినట్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో ఆయన తనను కలవడానికి రాలేదని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తన ఆరోగ్యం పట్ల ఆందోళనకు గురి కావొద్దని అన్నారు. ప్రస్తుతం ఆమె తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరిలో ఉంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. మొన్నటికి మొన్నే మాస్క్ లేకుండా అంబులెన్స్ను నడిపారు. ఫలితంగా ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమౌతున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు.