అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్యే వీరంగం- లాక్ డౌన్ ఉల్లంఘన- ఒడిశా పెళ్లి బస్సును విడిపించుకెళ్లిన వైనం...
శ్రీకాకుళం జిల్లాలో పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఒడిశా నుంచి వచ్చిన ఓ బస్సును తన అనుచరులతో కలిసి విడిపించుకుపోవడం సంచలనం రేపింది. నిన్న అర్ధరాత్రి ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మెలియాపుట్టి మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే...
ఒడిశాలో ఓ పెళ్లి కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్లింది. లాక్ డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ ఒడిశా వెళ్లిన బస్సు.. నిన్న అర్ధరాత్రి మెలియాపుట్టి మండలం పట్టుపురం వద్దనున్న అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది బస్సును అడ్డుకున్నారు.
లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్ రాష్ట్ర ప్రయాణాలు చేసి వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్ కు తరలించాల్సి ఉంది. అయితే బస్సును కూడా ఏపీలోకి అనుమతించకపోవడంతో స్ధానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు ఫోన్ వెళ్లింది. వెంటనే ఆయన తన అనుచరులతో కలిసి ఆరేడు కార్లలో అక్కడికి చేరుకున్నారు.
పోలీసులతో మాట్లాడి బస్సును ఏపీలోకి అనుమతించాలని కోరారు. పోలీసులు మాత్రం వినలేదు. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. బస్సును ఎట్టిపరిస్ధితుల్లోనూ అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. వినకపోవడంతో అక్కడే ఉన్న చెక్ పోస్టును ధ్వంసం చేశారు. చివరికి పోలీసులను భయభ్రాంతులను చేసి మరీ తమ వారిని బస్సుతో సహా విడిపించుకుని వెళ్లిపోయారు. బాధ్యత గల ప్రజాప్రతినిధి అయి ఉండి తన అనుచరులతో కలిసి లాక్ డౌన్ నిబందనలు ఉల్లంఘించడంపై పోలీసులు, స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.