బాధే కాదు.. నవ్వూ తెప్పించింది: నాలో ఆర్ఎస్ఎస్ భావజాలం: బీజేపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే రిటార్ట్
తిరుపతి: విప్లవ రచయితల సంఘం సీనియర్ నేత వరవరరావును విడుదల చేయాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడెప్పుడో రాసిన లేఖ.. తాజాగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్ఛార్జి సునీల్ దియోధర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నిన వరవర రావును జైలు నుంచి విడుదల చేయాలంటూ భూమన రాసిన లేఖను శనివారం ఆయన ట్వీట్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకు బదులు ఇస్తూ ఆదివారం లేఖ రాశారు. ఈ రెండు లేఖాస్త్రాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతున్నాయి.
ఘాటుగా బదులిచ్చిన భూమన..
భూమనను వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఙప్తి చేశారు. అలా చేయలేదంటే.. వైఎస్ జగన్ అనుమతితోనే ఆయన ఈ లేఖను రాసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. దీనికి భూమన బదులిచ్చారు. సునీల్ దియోధర్కు రెండు పేజీల బహిరంగ లేఖను రాశారు. వైఎస్ జగన్ను ఉద్దేశించి సునీల్ దియోధర్ చేసిన ట్వీట్లో తన గురించి ప్రస్తావన తీసుకుని రావడం వల్లే స్పందిస్తున్నానని, వివరణ ఇస్తున్నాననీ చెప్పారు.
ప్రధాని హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని సమర్థించడమా?
ప్రధానమంత్రి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని తాను ఎంతమాత్రమూ సమర్థించట్లేదని, ఆ పని తాను ఎప్పటికీ చేయనని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ 81 సంవత్సరాల వయోధిక వృద్ధుడైన వరవరరావు పట్ల జాలి చూపించమని తాను కోరానని, అంతేగానీ ఆయన భావజాలాన్ని తాను అంగీకరించినట్టు కాదని స్పష్టం చేశారు. 53 సంవత్సరాలుగా ఆయుధం పట్టి, సాయుధులై తిరిగే వాళ్లు సాధించలేని విప్లవాన్ని ఓ వయోధిక వృద్ధుడు సాధించగలడా? అనే అంశాన్ని తాను ప్రస్తావించానని గుర్తు చేశారు.
రాజకీయ జీవితం..ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రారంభం..
రాడికల్ భావాలు గల నాయకుడిగా తనను సమాజంలో ప్రచారం చేశారని అది సరి కాదని భూమన అన్నారు. తన రాజకీయ జీవితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలంతో ప్రారంభమైందని చెప్పారు. 1969-70 మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. అప్పటి తిరుపతి ఆర్ఎస్ఎస్ ప్రచారకులు బారా సారాథ్యంలో తాను పని చేశాననీ చెప్పారు. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ భావజాలం తనలో ఉందని భూమన చెప్పారు. సాయుధ పోరాటం మార్గం పట్ల గానీ, హింసను ఆయుధంగా తీసుకున్న వారి సిద్ధాంతాలను గానీ తాను విశ్వసించబోనని భూమన అన్నారు.
చంద్రబాబుపై నక్సల్స్ దాడికి నిరసనగా..
2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నక్సల్స్ దాడి చేసిన సమయంలో..తమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి తిరుపతిలో వ్యతిరేక ప్రదర్శనను నిర్వహించేలా చేశానని, దీన్ని చరిత్ర విస్మరించబోదని అన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు నక్సలైట్లతో జరిగిన చర్చల్లో ప్రతినిధిగా తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. పదవుల కోసం ఒకరికి ఒంగి బతకటం కంటే.. ఔన్నత్యం కోసం అసువులు బాయటమే నిజమైన మూర్తిమత్వం అనేది తాను నేర్చుకున్న జీవిత తొలిపాఠమని భూమన చెప్పారు.
81 సంవత్సరాల వృద్ధుడిపై జాలి చూపమని కోరడం..
వరవరరావుకు 81 సంవత్సరాలు వచ్చాయని, ఆయనపై జాలి చూపించమని ఉప రాష్ట్రపతిని కోరడం నేరం అని భావించడం సరికాదని భూమన అన్నారు. 46 సంవత్సరాల కిందట వరవరావు, తాను, ఉప రాష్ట్రపతి వెంకయ్య ఒకే జైలులో కలిసే ఉన్నామని, ఆ పరిచయంతోనే వ్యక్తిగతంగా లేఖ రాశానని వివరణ ఇచ్చారు. తాను మాత్రమే కాదని, ఎందరో కవులు, రచయితలు, మేధావులు కూడా వరవరరావును విడుదల చేయాలంటూ బహిరంగ లేఖలు రాశారని చెప్పారు. వారందరూ హింసావాదాన్ని సమర్థించినట్టు అవుతుందా? అని ప్రశ్నించారు.
Recommended Video
నవ్వు తెప్పించింది..
తన వ్యక్తిగత అభిప్రాయానికి, ముఖ్యమంత్రితో ముడిపెడుతూ రాసిన లేఖ తన బాధ కలిగించడంతో పాటు నవ్వు కూడా తెప్పించిందని భూమన వ్యాఖ్యానించారు. శతృవును చంపడం కాదు.. క్షమించడమే పెద్ద శిక్ష అని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల తనకు అపార గౌరవం, ప్రేమాభిమానాలు ఉన్నాయని, ఆయన తమందరి అభిమాన నాయకుడని భూమన చెప్పారు. తరతరాల భారతీయ సంస్కృతి నేర్పిన క్షమాగుణం, న్యాయం ధర్మం, మనిషి వైపు నిలబడటమే నేరమైతే.. అలాంటి నేరాన్ని తాన నిత్యం చేస్తూనే ఉంటానని చెప్పారు.