లాక్డౌన్ వేళ.. వైసీపీ ఎమ్మెల్యే భారీ ఊరేగింపు.. ట్రాక్టర్లతో చక్కర్లు: ప్రభాస్, వైఎస్ భారతి సహా..
చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను విధించిన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తన నియోజకవర్గంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి పట్టణంలో చక్కర్లు కొట్టారు. ఆయన చేసిన ఈ చర్య వల్ల వివాదాలు చెలరేగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
Recommended Video
కేసులు పెరుగుతుంటే లాక్ డౌన్ ఎత్తేస్తారా ?- జగన్ ది అవగాహనా రాహిత్యమన్న టీడీపీ ఎంపీ..
విరాళాలు ఇచ్చిన దాతలకు..
కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విరాళాలను ఆశిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సహాయ నిధి, ప్రధానమంత్రి కేర్స్కు కోట్లాది రూపాయలను విరాళంగా అందజేస్తున్నారు పలువురు ప్రముఖులు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మొదలుకుని.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల వరకు తమ విరాళాలను అందజేస్తున్నారు.
ట్రాక్టర్లతో ఊరేగింపు..
విరాళాలను ఇచ్చిన దాతలకు కృతజ్ఙతలు తెలుపుతూ బియ్యపు మధుసూధన్ రెడ్డి భారీ ఊరేగింపును నిర్వహించారు. వారి ఫ్లెక్సీలను అమర్చిన ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ప్రముఖుల ఫొటోలు, వారు ఇచ్చిన విరాళ మొత్తాన్ని ఈ ఫ్లెక్సీలపై ముద్రించారు. అనంతరం వాటిని శ్రీకాళహస్తీశ్వర, జ్ఙాన ప్రసూనాంబ దేవస్థానం మొదలుకుని పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీగా తరలివెళ్లారు.
విమర్శలు ఎక్కు పెట్టిన రాజకీయ ప్రత్యర్థులు..
బియ్యపు మధుసూదన్ రెడ్డి చేపట్టిన ఈ ట్రాక్టర్ల ప్రదర్శన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే.. తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వేలాదిమంది ప్రజలు తమ పనులను వదులుకుని ఇళ్ల దగ్గరే ఉంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎమ్మెల్యేగా వారికి మార్గదర్శకం చేయాల్సిన ఆయన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మండిపడుతున్నారు.
విమర్శల సంగతెలా ఉన్నప్పటికీ..
విమర్శలను తాను పట్టించుకోవట్లేదని, ఆపత్కక సమయంలో కోట్లాది రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన దాతలకు కనీస కృతజ్ఙత చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపైనా ఉందని బియ్యపుే మధుసూధన్ రెడ్డి చెబుతున్నారు. తాను చేస్తోన్న పనులను ప్రజలు ఆదరిస్తున్నారనే అక్కసుతోనే ప్రతి పనిలోనూ రంధ్రాలను వెదుకుతున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయాలు, విమర్శలు ఎప్పుడూ ఉండేవేనని, వాటి పట్ల స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి, వారిలో అవగాహనను కల్పించడానికి తన పని తాను చేసుకుంటున్నానని చెప్పారు.