మోడీ ఫార్ములాను ఫాలో అవుతోన్న వైసీపీ ఎమ్మెల్యే:పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ:కాళ్లు కడిగి,పూలుచల్లి
చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందని శాసనసభ్యుడొకరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనిపెట్టిన ఫార్ములాను అచ్చంగా ఫాలో అవుతున్నారు. ఇదివరకు నరేంద్ర మోడీ పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ నిర్వహించారు. అదే సూత్రాన్ని వైసీపీ ఎమ్మెల్యే కూడా అనుసరించారు. పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటోన్న మున్సిపల్ కార్మికులకు ఆయన కాళ్లు కడిగి, పాదపూజ చేశారు. ఆయనే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.
కొంపముంచిన అత్యుత్సాహం: దీపాల వేళ..అగ్నిప్రమాదాలు: హైదరాబాద్లో బైక్: కరోనా దిష్టిబొమ్మ
నాడు ప్రధాని పాదపూజ.
అర్ధ కుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలను ఆచరించడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చేరుకున్న సమయంలో పారిశుధ్ధ్య కార్మికులు 24 గంటల పాటు సేవలను అందించిన విషయం తెలిసిందే. కనీస విశ్రాంతి తీసుకోకుండా ప్రయాగ్రాజ్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. లక్షలాది మంది భక్తులు ఒకేచోట గుమికూడిన అప్పటి పరిస్థితుల్లో ఏ మాత్రం అంటు వ్యాధులు ప్రబలకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వారి సేవలను గుర్తించిన నరేంద్ర మోడీ.. స్వయంగా కొందరు కార్మికులకు పాదపూజ చేశారు.
నేడు వైసీపీ ఎమ్మెల్యే..
తాజాగా బియ్యపు మధుసూదన్ రెడ్డి అదే పని చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో అహర్నిశలు శానిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఆయన పాదపూజ చేశారు. కొందరు కార్మికుల పాదాలను కడిగి.. పూలు చల్లారు. వారి పాదాలను నమస్కరించారు. లాక్డౌన్ విధించిన వాతావరణంలో పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారని, వారిని గౌరవించుకోవడం ఓ ప్రజా ప్రతినిధిగా తన విధి అని ఆయన అన్నారు.
కరోనా పాజిటివ్ కేసులు నమోదైన స్థితిలోనూ..
చిత్తూరు జిల్లావ్యాప్తంగా 17 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క శ్రీకాళహస్తిలో సుమారు మూడు కేసులు ఉన్నాయి. దీనితో శానిటేషన్ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో.. ఆయన ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులతో కలిసి పట్టణంలో పర్యటిస్తున్నారు.
24 గంటలు అందుబాటులో కార్మికులు..
ఇందులో భాగంగా- పారిశుధ్య విభాగం కార్మికుల పనితీరును ఆయన దగ్గరుండి పరిశీలించారు. కరోనా వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటూనే 24 గంటల పాటు అందుబాటులో ఉండటాన్ని గుర్తించారు. వారి సేవలను ప్రశంసిస్తూ.. పాదపూజ చేశారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి.. వారి కాళ్లు కడిగారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందిన విషయం తెలిసినప్పటికీ.. క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నారని, రాత్రివేళ ఫోన్ చేసినా తక్షణమే స్పందిస్తున్నారని మధుసూదన్ రెడ్డి తెలిపారు. వారిని గౌరవించుకోవడంన తన విధి అని చెప్పారు.