దేవినేని.. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే.. ఓసారి పుస్తకాలు తిరిగెయ్యి.. : బుగ్గన
కర్నూల్ : ఏపీ మంత్రి దేవినేని ఉమా చేస్తోన్న భూ ఆక్రమణ ఆరోపణలను తిప్పికొట్టారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తనపై ఆరోపణలు చేసే ముందు ఒకసారి చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే..! నిజాలేంటో తెలుస్తాయని దేవినేనికి గట్టి బదులిచ్చారు.
కాగా, కర్నూల్ జిల్లా పరిధిలోని బనగానపల్లె మండలంలో ఎమ్మెల్యే బుగ్గన నారజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవినేని వ్యాఖ్యలపై స్పందించిన బుగ్గన.. దేవినేని వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
దేవినేని భూ ఆక్రమణ ఆరోపణలపై వివరణ ఇస్తూ.. 1929 నుంచి ఇప్పటివరకు ఆ భూములు తమ కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. బ్రిటీష్ వాళ్లు పరిపాలించిన కాలంలో ఆహార ఉత్పత్తులు పెంచే ఉద్దేశమై అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వమే వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్లకు భూములను పంపిణీ చేసిందని, ఇవన్నీ తెలియాలంటే చరిత్ర పుస్తకాలు తిరిగేయాలని దేవినేనికి సలహా ఇచ్చారు.
దేవినేని ఆరోపణల ప్రకారం భూ ఆక్రమణలే నిజమైతే.. 1929 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలన్ని తమ కుటుంబం పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నాయా..? అన్న రీతిలో ప్రశ్నించారు. ఆ ప్రభుత్వాలకేమైనా తన మీద ప్రేమా..? మౌనంగా వ్యవహరించడానికి అని నిలదీశారు. దేవినేని ఓ డిటెక్టివ్ లాగా తానేదో గొప్ప విషయాన్ని కనిపెట్టానన్న తరహాలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే.. సాగునీటి కాలువల నిర్మాణం కోసం స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే తనతో పాటు భూములు కోల్పోయే.. రైతుల భూములను కూడా చట్టబద్దంగానే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఒకవేళ చట్టబద్దంగా గాక ప్రభుత్వమే దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే.. అది ఎంతకీ తెగని వ్యవహారమే అని చెప్పుకొచ్చారు.
ఇక మంత్రి దేవినేనిపై పలు విమర్శలు కూడా గుప్పించారు ఎమ్మెల్యే బుగ్గన. అసలు దేవినేని తరుచూ కర్నూల్ జిల్లాకు ఎందుకొస్తున్నారో తెలియట్లేదని అక్కడి అధికారులే గుసగుసలాడుకుంటున్నట్టు చెప్పారు. ఆయన జిల్లా పర్యటనంటేనే అక్కడి ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడిందని, జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయనకు సౌకర్యాలు కల్పించలేక అధికారులు ఆపసోపాలు పడుతున్నారని ఆరోపించారు.