సమైక్యాంధ్ర ఉద్యమంలో రైలు దగ్ధం కేసులో చెవిరెడ్డి అరెస్ట్, రిమాండ్
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సోమవారం వేకువజామున నాలుగు గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం ఎయిర్ ఇండియా మేనేజర్ పైన దాడి కేసులో ఎంపి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత సోమవారం నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు. తాజాగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
చెవిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నెల్లూరు కోర్టుకు తరలించారు. ఈ నెల 29వ తేదీ దాకా న్యాయస్థానం చెవిరెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో చిత్తూరు జిల్లాలో వైసిపి కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో రైలు దగ్ధం కేసులో అతనిని అరెస్టు చేశారని తెలుస్తోంది.
మరోవైపు, ఉదయం అరెస్టైన గుంటూరు జిల్లా నరసారావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని స్టేషన్ బెయిల్ పైన విడుదల చేశారు.