నరసింహ యాదవ్ అవుట్.. చెవిరెడ్డి ఇన్!
తిరుపతి: ప్రతిష్ఠాత్మక తిరుపతి పట్టణాభివృద్ధి అథారిటీ (తుడా) ఛైర్మన్గా చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామల రావు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జీ నరసింహ యాదవ్ తన పదవికి ఇదివరకే రాజీనామా చేశారు. ఈ రాజీనామా పత్రాన్ని శ్యామల రావు ఆమోదించారు. ఆ వెంటనే- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ నోటిఫికేషన్ను ఇచ్చారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశానికి చెందిన నరసింహ యాదవ్ను తుడా ఛైర్మన్గా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో.. అప్పటి ప్రభుత్వంలో నామినేట్ అయిన ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. నరసింహ యాదవ్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని శ్యామల రావుకు పంపించారు. ఆయన దీన్ని ఆమోదించారు. వెంటనే- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన స్థానంలో నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
పలమనేరు-కుప్పం-మదనపల్లి అభివృద్ధి అథారిటీ ఛైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయనను చంద్రబాబు ప్రభుత్వమే నామినేట్ చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో సుబ్రహ్మణం రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవర్నీ నియమించలేదు.