జైల్లోనూ నిరహరదీక్షను కొనసాగిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనూ దీక్షను కొనసాగిస్తున్నారు.
చిత్తూరు: ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనూ దీక్షను కొనసాగిస్తున్నారు.
మంచినీళ్ళు ముట్టకోకుండానే చిత్తూరు సబ్ జైలులో దీక్షను చేస్తున్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.తన పోరాటాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆయన ఆరోపించారు.
రామాపురంలో చెత్త డంపింగ్ యార్డును తరలింపు డిమాండ్ తో నిరహరదీక్ష చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను శనివారం నాడు పుత్తూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హజరుపర్చారు. పుత్తూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే తో పాటు 35 మంది గ్రామస్థులకు కూడ వచ్చేనెల 7వ, తేది వరకు కోర్టు రిమాండ్ విధించింది. తమ తరపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డికి మద్దతుగా రామచంద్రాపురం, తిరుపతి రూరల్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.