తిరుపతి పోలీసులపై పల్లిపట్టులో ఫిర్యాదు, 'రోజా అంటే బాబుకు భయమెందుకు'
చిత్తూరు: తన పైన తిరుపతి పోలీసులు దాడి చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పల్లిపట్టు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డిని పోలీసులు వాహనంతో ఢీకొట్టించారని వార్తలు వచ్చాయి. గాయపడిన చెవిరెడ్డి తమిళనాడులోని పల్లిపట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడి చేశారని చెవిరెడ్డితో పాటు నగరి ఎమ్మెల్యే రోజా పల్లిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు నేతలు చెవిరెడ్డిని పరామర్శించారు.
రోజాను చూస్తే చంద్రబాబుకు భయమెందుకు?
తమ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను చూస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భయం ఎందుకని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన తిరుపతిలో మాట్లాడారు. చంద్రబాబుకు, టిడిపి నాయకులకు రోజా అంటే భయమన్నారు.
ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దారుణమన్నారు. తప్పులు, అన్యాయాలను ఎత్తి చూపితే ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆటవిక పరిస్థితి నెలకొందన్నారు.
శాంతియుత నిరసన తప్పా: శ్రీకాంత్ రెడ్డి
గాంధీ మార్గంలో బంద్ చేస్తున్న నాయకులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే ఆమెను ఇంటికి పిలిపించి పంచాయతీ చేశారని మండిపడ్డారు. రిషికేశ్వరి కేసులో దోషులను ఇంకా శిక్షించలేదన్నారు. పదేపదే చట్టాలను ఉల్లంఘించే వారిని వెనకేసుకు రావడం ఎంతవరకు సమంజసమన్నారు.