నల్లారి కుటుంబాన్ని ఐదుసార్లు ఓడించాం, మేం దద్దమ్మలమా: చింతల
చిత్తూరు: నల్లారి కుటుంబీకులను ఐదు ఎన్నికలలో ఓడించిన ఘనత తన కుటుంబానికి చెందుతుందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చెప్పారు.నల్లారి కిరణ్కుమార్రెడ్డి, ఆయన సోదరుడు కిశోర్కుమార్రెడ్డి సహా ఆయన అన్న, తండ్రి, తల్లిని ఓడించిన తాము దద్దమ్మలమా అని విరుచుకుపడ్డారు.
నల్లారి కుటుంబీకులు ఎన్నికలలో గెలిచినా, ఓడినా వారి అడ్రస్ హైదరాబాదేనని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేది తానేనని పీలేరు ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి అన్నారు. గురువారం పీలేరులో జరిగిన వైసీపీ నవరత్నాల సభలో ఆయన పాల్గొన్నారు. నల్లారి కుటుంబీ కులు పీలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు.
అయితే ముఖ్యమంత్రి స్థాయిలో నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదని, ఎంపీ మిధున్రెడ్డి నిధులతో 130 గ్రామాలలో నీటి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు.
గత ఎన్నికల తరువాత నియోజకవర్గానికి మూడున్నర సంవత్సరాలు దూరంగా హైదరాబాద్లో విలాసజీవితం గడుపుతున్న నల్లారి కిశోర్కుమార్రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ పర్యటన పేరుతో ఎంపీ, ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
నల్లారి కిశోర్కుమార్రెడ్డి టీడీపీలో చేరేందుకు తహతహలాడుతూ చంద్రబాబు ఇంటి వద్ద పడి గాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు మెప్పు పొందేందుకే తనను ఎంపీని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ చేపట్టనున్న పాదయాత్రలో పీలేరు నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తారని ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డి చెప్పారు. జిల్లాలో పీలేరు నియోజకవర్గంలోనే ఎక్కువ రోజులు, ఎక్కువ ప్రాంతాల్లో పాదయాత్ర ఉంటుందని వివరించారు. నీరు ప్రగతి పథకం టీడీపీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నదని ఆరోపించారు.
గతంలో తాము చెరువులను అభివృద్ధి చేస్తే వర్షాలకు ఆ చెరువుల్లోకి నీరు చేరితే టీడీపీ నాయకులు తమ ఘనతగా చెప్పుకుని కొబ్బరికాయలు కొట్టడం విడ్డూరంగా ఉందన్నారు.