చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా చెప్పగలరా.. వైసీపీ సవాల్..
అసత్యాలు,దుష్ప్రచారాలతో ఏపీ ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ఆయనలా దిగజారి మాట్లాడేందుకు తమ సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదని.. ఇక రాజధానిని ఎలా నిర్మించగలరని ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
చంద్రబాబుకు గడికోట సవాల్..
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు.. ఉత్తరాంధ్రలో రాజధాని ఎందుకని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు అవసరం లేదని బహిరంగంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. సీఎం జగన్పై వ్యక్గిగత విమర్శలకు దిగడం దిగజారుడు రాజకీయం అని మండిపడ్డారు. శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తున్న టీడీపీ.. తీర్మానం సందర్భంగా చర్చకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. అసలు అభివృద్ది వికేంద్రీకరణ,అన్ని ప్రాంతాల సమ అభివృద్దిపై టీడీపీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
గ్రంధి శ్రీనివాస్ ఫైర్..
వైసీపీ మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేనందుకే చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారని విమర్శించారు. తన కొడుకునే చంద్రబాబు గెలిపించుకోలేకపోయారని పేర్కొన్నారు. చంద్రబాబును చూస్తుంటే మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ అన్న సామెత గుర్తుకు వస్తుందని చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటన్నారు.
శాసనమండలి రద్దుపై చంద్రబాబు..
శాసనమండలి రద్దు నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారనే ఆక్రోశంతోనే మండలి రద్దుకు తీర్మానం చేశారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీది నేరస్థుల ముఠా అని, వైసీపీ ఎమ్మెల్యేల్లో 86 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయని అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అనే జగన్కు.. ఆ కేసులపై మాట్లాడే ధైర్యముందా అని ప్రశ్నించారు. మండలి రద్దుపై తీర్మానంపై సమయంలో డ్రామా జరిగిందని.. సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. చివరకు 133 మంది ఉన్నారని ప్రకటించడమేంటని ఆయన నిలదీశారు.