నాన్ బెయిల్బుల్ కేసు: నరసరావుపేట ఎమ్మెల్యే అరెస్ట్, ఉద్రిక్తత
గుంటూరు: ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం గుంటూరు జిల్లా నరసారావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలోని అసైన్ట్ భూముల్లో అధికారులు రహదారి పనులు చేస్తుండగా ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్లి అడ్డుకున్నారు.
దీంతో ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించేలా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఎమ్మార్వో రాజారత్నం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు నాన్ బెయిల్బుల్ కేసు నమోదు చేసి, సోమవారం ఉదయం ఆయన్ని అరెస్ట్ చేశారు.
గోపిరెడ్డి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు, ఆయన్ను పోలీస్ స్టేషనుకు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆయన మద్దతుదారులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో నరసారావుపేటలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాగా, తమిళనాడు రాజధాని చెన్నై ఎయిర్ పోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గతేడాది నవంబర్ 26న ఎయిర్ పోర్ట్ అధికారితో తలెత్తిన గొడవ విషయమై ఎంపీని అరెస్ట్ చేశారు.