కరోనా తర్వాత కాదు.. ఇప్పుడే కాణిపాకం రా.. పర్మిషన్ ఇప్పిస్తాం.. : కన్నాకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. కరోనా.. ఇవన్నీ ఒకటే తెగకి చెందిన వైరస్లని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. నారా..కన్నా.. ఇద్దరూ కరోనా బద్రర్స్ అని ఎద్దేవా చేశారు. కరోనా జీవితాలను నాశనం చేస్తే వీరు రాజకీయాలను నాశనం చేసే వ్యక్తులని విమర్శించారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు ఈ ఇద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐసీఎంఆర్ అనుమతిచ్చిన కొరియా కంపెనీ నుంచే ఏపీ ప్రభుత్వం ఒక్కో ర్యాపిడ్ టెస్ట్ కిట్కి రూ.730 చొప్పున ఒప్పందం చేసుకుందన్నారు. అదే కిట్ను కేంద్ర ప్రభుత్వం రూ.790 కొనుగోలు చేసిందన్నారు. ఈ లెక్కన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా.. లేక సొంత పార్టీపైనే చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. రూ.20కోట్లకు అమ్ముడుపోయిన కన్నా.. టీడీపీ డైరెక్షన్ మేరకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
కన్నా చేసిన సవాల్ను ఎంపీ విజయసాయి రెడ్డి స్వీకరించారని అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు నుంచి కన్నాకు రూ.20 కోట్లు ముట్టాయని కాణిపాకం వినాయకుడి ఎదుట ప్రమాణం చేసేందుకు ఆయన సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడంటే.. ఇప్పుడు ఆయన కాణిపాకం రావడానికి సిద్దమన్నారు. కానీ కన్నానే కరోనా తర్వాత అంటూ వాయిదా వేస్తున్నారని.. కావాలంటే తామే అనుమతులు ఇప్పిస్తామని అన్నారు. కాణిపాకం వచ్చి చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారా లేదా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
కన్నా వైసీపీలో చేరాలనుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇంటి ముందు బ్యానర్లు కట్టుకోలేదా అని నిలదీశారు. కన్నా జేబులు,సూట్ కేసుల నిండా టీడీపీ డబ్బులు నింపిందని.. అందుకే బీజేపీలో చేరి తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఒకరికి రూ.20 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఇలా చెప్తూ పోతే కన్నా కాణిపాకంలో చేయాల్సిన ప్రమాణాలు చాలానే ఉన్నాయని ఎద్దేవా చేశారు.