నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జోగి రమేష్: ఏపీ హైకోర్టులో పిటీషన్
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై విధించిన ఆంక్షలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తప్పు పట్టారు. దీనిపై ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ కాస్సేపట్లో విచారణకు రాబోతోంది. తన పరిధులను అధిగమించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారంటూ ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధులపై ఆంక్షలు విధించే అధికారం ఆయనకు లేదని పిటీషన్లోొ పేర్కొన్నారు.
నిమ్మగడ్డ విచక్షణాధికారాలకు చెక్: మంత్రి పెద్దిరెడ్డికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
శనివారం వరకూ జోగి రమేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడకూడదని, విలేకరుల సమావేశాలను నిర్వహించకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వెయ్యకపోతే ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నిలిపివేస్తామంటూ ఓటర్లను ఆందోళనలకు గురి చేశారనే ఫిర్యాదులు జోగి రమేష్పై ఉన్నాయి. ఓటర్లను ఆయన బెదిరిస్తోన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.
ఇది తన దృష్టికి రావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఓటర్లను భయాందోళనలకు గురి చేశారనే కారణంతో ఆయనపై చర్యలకు దిగారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకూ ఆయన మీడియాతో మాట్లాడకూడదంటూ ఆంక్షలను విధించారు. దీనిపై జోగి రమేష్పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శాసన సభ్యుడిపై చర్యలు తీసుకోవడవ, ఆంక్షలను విధించే అధికారం నిమ్మగడ్డకు లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను లంచ్ మోషన్ పిటీషన్లో పొందుపరిచారు. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. కాస్సేపట్లో ఇది విచారణకు రానుంది.
ఇదివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపైనా ఇదే దరహాలో చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన తుది విడత పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకూ మీడియా ప్రతినిధులతో మాట్లాడకూడదంటూ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను పెద్దిరెడ్డి.. హైకోర్టులో సవాల్ చేశారు. ఆ ఆంక్షలను హైకోర్టు కొట్టి వేసింది. తనకు కూడా అలాంటి వెసలుబాటే లభిస్తుందని జోగి రమేష్ విశ్వసిస్తున్నారు.