బాబు పాలన ఎక్కువకాలం సాగదంటూ కొడాలి నాని సంచలనం
మోసం చేసి చంద్రబాబునాయుడు నిరంతరం పాలన సాగించలేరని వైసీపీ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
మచిలీపట్నం: మోసం చేసి చంద్రబాబునాయుడు నిరంతరం పాలన సాగించలేరని వైసీపీ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. శనివారం నాడు పట్టణంలోని రెవిన్యూ కళ్యాణ మండపంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలను వంచించి నయవంచక పాలన చేస్తున్న చంద్రబాబు పాలనకు రోజులు దగ్గరపడుతున్నాయన్నారు.
పులిచింతలను 90 శాతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారని, మిగిలిన పనుల్ని కిరణ్ కుమార్ రెడ్డి చేసి ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. రెండేళ్ళలో రైతు బాంధవుడు రాజన్న రాజ్యం వస్తోందన్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి కంటే గట్టివాడన్నారు. మోసాలతో రోజులు వెళ్ళదీసే తత్వం జగన్ కు లేదన్నారు. అవినీతిని టిడిపి నాయకులు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు.
బ్రిటీష్ కాలం నుండి గత ప్రభుత్వం వరకు బందరులో పుష్కరాలు నిర్వహించారన్నారు. మున్సిపాలిటీలో ప్రజల ఇంటి పన్నుల జనరల్ ఫండ్ నుండి 60 లక్షలను పుష్కరాలకు ఖర్చుచేసిన మున్సిఫల్ ఛైర్మెన్, మంత్రి రవీంద్ర అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
బందరులో పేర్నినాని హయంలోనే అభివృద్ది జరిగిందన్నారు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి.ప్రస్తుత పాలకులు మాటలు చెప్పడం మినహ, ఇతర పనులు చేయడం లేదన్నారు.