బాబుకు చేతులు జోడిస్తున్నా: కోటంరెడ్డి, 50 కోట్లు.. రెచ్చిన ఉమ, ఎదురుతిరిగిన జగన్
హైదరాబాద్: ఏపీ శాసన సభ వాయిదా అనంతరం తిరిగి సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత జగన్ కేసుల్లో నిండా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి మిగతా వారి పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివద్ధి వేరన్నారు. జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ప్రతి దానికి సిబిఐ విచారణ అంటే ఎలా అన్నారు. బిజెపి తరఫున చంద్రబాబుపై చేసిన ఆరోపణలు వ్యతిరేకిస్తున్నామన్నారు. సాక్షాలు ఉంటే ఇవ్వాలి లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు.
సీఎంను చేతులు జోడించి అడుగుతున్నా
వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. టిడిపి సభ్యులు మాటల తీరు వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ సీఎంగా ఉండాలనుకుంటున్నట్లుగా ఉందన్నారు నేను మొదటిసారి సభ్యుడిగా ఎన్నికయ్యానని, సీనియర్ అయిన సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరితే బాగుండదన్నారు.
కాబట్టి తాను రెండు చేతులు జోడించి అడుగుతున్నానని, జగన్ చేసిన ఆరోపణల పైన చంద్రబాబు సవాల్ విసురుతున్నారని, మరి రాజధాని భూముల పైన తమ సవాల్కు ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదని, ఇందులోని చిదంబర రహస్యం ఏమిటని కోటంరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబును తాను చేతులు జోడించి అడుగుతున్నానని, తమ ఆరోపణల పైన చంద్రబాబు సిబిఐ విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పాలన్నారు. కుంభకోణాల పైన విచారణకు చంద్రబాబు వెంటనే అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి నేతలు రాజధానిలో భూములు కొన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ చూస్తుంటే బాధగా ఉందన్నారు. మీరు నిర్దోషులైతే విచారణకు అంగీకరించాలన్నారు.
వైయస్ దోపిడీపై మాట్లాడుతాం
దానికి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. స్పీకర్, కోర్టుల పైన జగన్ బురద జల్లుతున్నారన్నారు. విపక్ష నేత వద్ద ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. ఆరోపణలు చేసే ముందు స్పీకర్కు నోటీస్ ఇవ్వాలన్నారు. వైయస్ హయాంలో దోపిడీ జరిగింది కాబట్టే తాము మాట్లాడుతున్నామన్నారు.
ఆయితే, ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ఆధారాలు చూపించాలన్నారు. గతంలో చాలాసార్లు ఛాలెంజ్ చేసి ప్రతిపక్ష నేత తప్పించుకుపోయాడన్నారు. ప్రతిపక్షం ఆధారాలు చూపితే బాధ్యుల పైన తాము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జగన్ ఆర్థిక ఉగ్రవాది అని సుప్రీం కోర్టు చెప్పింది: బోండ ఉమ
బోండ ఉమ మాట్లాడుతూ... జగన్ నిరాధార ఆరోపణలు ప్రభుత్వంపై చేశారన్నారు. తన బురదను మాకు అంటించాలని చూస్తున్నారన్నారు. సాక్షి మీడియాతో తమ పైన బురద జల్లే ప్రయత్నం చాలా రోజులుగా చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై పథకం ప్రకారం బురద జల్లుతున్నారన్నారు.
జగన్ ఓ ఆర్థిక ఉగ్రవాది అన్నారు. ప్రతిపక్షం సిబిఐ విచారణ అడగడం విడ్డూరమన్నారు. చిన్న ఆధారమైనా లేకుండా ఎలా విచారణ జరుపుతారని ప్రశ్నించారు. వైయస్ హయాంలో జరిగిన అవినీతిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే జగన్ 16 నెలలు జైలులో గడిపారన్నారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అని సుప్రీం కోర్టే అభిప్రాయపడిందన్నారు.
కానీ తమ పైన వైసిపి చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఆధారాలు ఇసుమంత కూడా లేకుండా విచారణ ఎలా చేపడతారన్నారు. పెన్నా ప్రతాప్ రెడ్డిని రూ.50 కోట్లు జగన్ డిమాండ్ చేసింది నిజమా కాదా చెప్పాలని బోండ ఉమ డిమాండ్ చేశారు.
జగన్కు నీతి నిజాయితీ ఉంటే ఆయన సభకు క్షమాపణ చెప్పాలన్నారు. తాను తప్పు చేసినట్లు జగన్ కచ్చితంగా అంగీకరించాల్సిందే అన్నారు. ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ఆర్థిక నేరస్థుడు ఉగ్రవాది కన్నా ప్రమాదమని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. జగన్ సారీ చెప్పాకే ఇంటికెళ్లాలన్నారు.
స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ.. ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలని వైసిపి అధినేత జగన్కు హితవు పలికారు. ఆరోపణలకు ఆధారాలు చూపించి అవిశ్వాసంపై చర్చను పూర్తి చేయాలన్నారు. మీకు ప్రజా సమయాన్ని వృథా చేసే హక్కు లేదన్నారు.
నేను దోషిని అని కోర్టు చెప్పిందా: ఎదురు తిరిగిన జగన్
తన పైన రూ.43వేల కోట్ల ఆరోపణలు చేస్తున్నారని, తనను కోర్టు దోషిగా నిర్ధారించిందా అని జగన్ ఎదురు ప్రశ్నించారు. తన పైన కేసులు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారో గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన పైన కేసులు లేవన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాక చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలిసి తన పైన కేసులు పెట్టాయన్నారు. తనకు రూ.43వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారని, తనకు పావలా వంతు ఇస్తే వాటిని రాసిస్తామని చెప్పారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు తన పైన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ.. ఆడియో, వీడియోల్లో బ్లాక్ మనీతో దొరికిపోయాడన్నారు. దాని గురించి ఏమిటో చెప్పాలన్నారు. 1978లో చంద్రబాబు ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు.
బిజెపి సభ్యుడు ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. సభ చూస్తుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటంగా కనిపిస్తోందన్నారు. ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాధారాలతో నిరూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యవస్థలు కూలిపోయాయన్నది వాస్తవం అన్నారు.