వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెయిల్: ఆమెకు బహిరంగ క్షమాపణ చెబుతా: జగనన్న సైనికుడినే
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇంటిపై దౌర్జన్యానికి దిగిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆదివారం తెల్లవారు జామున కోటంరెడ్డిని అరెస్టు చేసిన నెల్లూరు రూరల్ పోలీసులు ఉదయం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను న్యాయమూర్తికి అందించారు. ఈ సందర్భంగా బెయిల్ మంజూరు చేయాలని కోటంరెడ్డి తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టారు. దీనిపై రూరల్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఫలితంగా- ఆయనకు వెంటనే బెయిల్ లభించింది.
ఎస్పీపై ఏ చర్య తీసుకుంటారు?
బెయిల్ లభించిన అనంతరం కోటంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. సొంత ప్రభుత్వంలో తాను అరెస్టయినప్పటికీ ఎప్పటికీ రాజన్న భక్తుడినేనని, జగనన్న సైనికుడినేని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే తనపై జిల్లా పోలీసు యంత్రాంగం కక్షసాధింపులకు దిగిందని ఆరోపించారు. ఇందులో జిల్లా ఎస్పీ ప్రమేయం ఉందని విమర్శించారు. ఎన్నికల సమయంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఆయన.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత తనపై ఏ రకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనేది జిల్లా ప్రజలందరికీ తెలుసునని అన్నారు. చట్టానికి ఎవరైనా లోబడే ఉండాలనే కారణంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, దాన్ని ఎస్పీ పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఆయనపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ప్రభుత్వం మీదే ఆధారపడి ఉందని చెప్పారు.
అర్ధరాత్రి పోలీసులను పంపిస్తారా?
జిల్లా ఎస్పీ తన ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులను పంపించారని కోటంరెడ్డి విమర్శించారు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే తానే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయే వాడినని చెప్పారు. తన స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటికి 30 మంది కానిస్టేబుళ్లను పంపించారని, తాము గజదొంగలమా? అని ప్రశ్నించారు. తన తోటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుడిభుజం, వెంకటాచలం మండలం వైసీపీ నాయకుడు ప్రదీప్ రెడ్డి పట్ల పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుళ్లు దారుణంగా అవమానపరిచారని అన్నారు. జిల్లాలోని నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కోరుతూ తాను చేపట్టిన ఉద్యమం అనంతరం ఎస్పీ వేధింపులు తీవ్రం అయ్యాయని చెప్పారు.
బహిరంగ క్షమాపణకు సిద్ధం
వెంకటాచలం ఎంపీడీఓ సరళ నివాసంపై తాను ప్రత్యక్షంగా దౌర్జన్యానికి దిగి ఉన్నట్లు నిరూపిస్తే..బహిరంగంగా ఆమెకు క్షమాపణ చెబుతానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తాను సంఘటనాస్థలంలో లేనప్పటికీ.. ఉన్నానని చెబుతూ కేసు పెట్టారని, దీని వెనుక ఎస్పీ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. తన అనుచరులు వెళ్లి ఉండొచ్చని, తాను ఆమె ఇంటికి వెళ్లలేదని అన్నారు. జిల్లాకు చెందిన ఉద్యోగుల్లో ఏ ఒక్కరైనా సరే.. ముందుకొచ్చి, సరళ ఇంటిపై తాను ప్రత్యక్షంగా దౌర్జన్యానికి దిగినట్లు మాటమాత్రంగా చెప్పినా సరే క్షమాపణ చెబుతానని అన్నారు.