వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్.. ఎంపీడీఓపై దౌర్జన్యం.. జగన్ ఆదేశాలతో
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం స్థానిక కారాగారానికి తరలించారు. వెంకటాచలం మండలం ఎంపీడీఓ సరళపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే కేసులో కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరుడు బీ శ్రీకాంత్ రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై సొంత పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జగన్ ఆదేశాలతో..
వైఎస్ జగన్ ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే కోటంరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్.. నెల్లూరులో చోటు చేసుకున్న వరుస ఘటనలపై వివరాలను తెలుసుకున్నారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ తో మాట్లాడారు. ఈ ఘటనలో తమ పార్టీ శాసన సభ్యుడి ప్రమేయం ఉంటే చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టప్రకారం.. ఎలాంటి చర్యలకైనా వెనుకాడొద్దని సూచించారు.
జోక్యం చేసుకున్న కాకాణి..
ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీకే చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. కోటంరెడ్డి అనుచరుల ఆగడాలను అడ్డుకున్నారు. కోటంరెడ్డికి ఫోన్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నందున.. దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికారు. ఇదే వైఖరిని ప్రదర్శిస్తే.. తమకు, తెలుగుదేశం పార్టీకి పెద్ద తేడా లేకుండా పోయిందనే వ్యతిరేక భావన ప్రజల్లో ఏర్పడుతుందని హెచ్చరించారు. అనంతరం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి, సరళ నివాసానికి విద్యుత్, మంచినీటి సరఫరాను పునరుద్ధరింపజేశారు.
అధికార పార్టీ అని చూడొద్దు..
ఎంపీడీఓ సరళ ఇంటిపై దౌర్జన్యానికి దిగిన ఘటనలో కోటంరెడ్డి ప్రమేయం ఉందని సాక్ష్యాధారాలు లభిస్తే.. ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనే విషయాన్ని పట్టించుకోవద్దని, చట్టానికి లోబడి చర్యలకు వెనుకాడ వద్దని అన్నారు. సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు బీ శ్రీకాంత్ రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరిపై సెక్షన్ 448, 506, 427, 290 కింద కేసులు నమోదయ్యాయి.
ఇది రెండోసారి..
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ నాలుగు నెలల కాలంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఫిర్యాదులు నమోదు కావడం ఇది రెండోసారి. ఇది వరకు నెల్లూరు జిల్లాలోనే ప్రముఖ జర్నలిస్ట్, జమీన్ రైతు సంపాదకుడి ఇంటిపై దాడికి దిగిన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ పెద్దగా స్పందించలేదు. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిరోజుల్లోనే కోటంరెడ్డి అనుచరులు.. ఈ సారి ఏకంగా ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగినిపై ఇంటిపై దౌర్జన్యానికి దిగడం అటు అధికార పార్టీలో, ఇటు ప్రభుత్వ వర్గాల్లో కలకలం పుట్టిస్తోంది.
పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు..
జిల్లాలోని వెంకటాచలం మండలంలో సరళ అనే ఎంపీడీఓ నివాసంపై కోటంరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి దిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆదేశించినప్పటికీ వాటిని ఖాతరు చేయలేదని ఆరోపిస్తూ కోటంరెడ్డి అనుచరులు వెంకటాచలం మండలం కల్లూరి పల్లిలోని ఎంపీడీఓ సరళ ఇంటిపై దాడికి దిగారు. ఆమె నివాసానికి విద్యుత్, మంచినీటి సరఫరాను నిలిపివేశారు. దీనితో ఆమె అర్ధరాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపింది.