'అదే దుష్ట సాంప్రదాయం, నియంతృత్వ పోకడ.. ప్రజలే టీడీపీ గొంతు నొక్కుతారు'
అమరావతి: నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో.. సభ జరిగిన తీరు గురించి ప్రతిపక్షం వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. గత మూడేళ్ల దుష్ట సాంప్రదాయాన్ని టీడీపీ కొత్త అసెంబ్లీలోను కొనసాగించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తోందన్నారు.
సంఖ్యాబలం ఉందని సభలో అధికార పార్టీ మందబలంతో నియంతలా వ్యవహరిస్తోందని కోటంరెడ్డి విమర్శించారు. సభలో ప్రజావాణి వినిపించాలనుకున్న ప్రతిపక్షం గొంతు నొక్కేశారని అన్నారు. ప్రతిపక్షం ఏ సమస్యను లేవనెత్తినా జగన్మోహన్ రెడ్డికి పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే మైక్ కట్ చేయడం ద్వారా అధికార పార్టీ నియంతృత్వ ధోరణి అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందన్నారు.
ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వని అధికారపక్షం, అదే సమయంలో లేవనెత్తిన అంశాలతో సంబంధం లేని అధికార పార్టీ వ్యక్తులకు మాత్రం గంటల తరబడి మైక్ ఇస్తారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలతో సభా సమయాన్ని వారు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అధ్యక్ష మైక్.. అని అరుస్తూ పదే పదే పోడియం వద్దకు వెళ్లి అభ్యర్థిస్తే గానీ మైక్ ఇవ్వలేదని, ఒకవేళ ఇచ్చిన 30సెకన్లకు మించి మాట్లాడనివ్వడం లేదని అన్నారు.
రాష్ట్రంలో కీలక సమస్యలుగా ఉన్న అగ్రిగోల్డ్, పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆక్వాఫుడ్స్ కార్మికుల మరణాలు, రైతులకు గిట్టుబాటు ధర, మైనారిటీల సంక్షేమం, అంగన్ వాడీ సమస్యలు, విద్యార్థుల సమస్యలు.. ఇలా ఏ అంశంపై కూడా ప్రతిపక్షాన్ని అధికార పక్షం మాట్లాడనివ్వలేదని, సభా సమయాన్ని వృధా చేశారని కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో టీడీపీ గొంతును నొక్కాల్సిన చోట నొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్మోహన్ రెడ్డి ప్రజావాణి వినిపిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.