వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడి అరెస్ట్, టీడీపీ సంబరాలు
హైదరాబాద్/ఏలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేస్తున్న సుబ్బారాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ పార్టీ శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే మహాధర్నాకు బస్సులు కేటాయించడం లేదంటూ కొత్తపల్లి, పలువురు నేతలు ఆందోళన చేశారు.
తమ పార్టీపై వివక్షతోనే బస్సులు కేటాయించడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బస్సులు వేసిన ఆర్టీసీ, తమ ధర్నాకు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ధర్నా విజయవంతం కారాదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. మహాధర్నాకు బస్సులను కేటాయిస్తామని ఆర్టీసి చెప్పి, చివరి నిమిషంలో మాట మార్చిందన్నారు. అనంతరం కొత్తపల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
సంబరాల్లో టీడీపీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ విధాన ప్రకటన చేయగానే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తమ నేత నిలుపుకున్నారని తెలుగు తమ్ముళ్లు మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నగర టీడీపీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాలలోని టీడీపీ ఆఫీసుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రైతులు కూడా ఆనందిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
చంద్రబాబును కలిసిన గుంటూరు ఎమ్మెల్యేలు
గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శ్రీధర్, ఆంజనేయులు గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతి కెనాల్కు నీరు విడుదల చేయాలని వారు కోరారు. అదికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పారు. కాగా, గురువారం సాయంత్రం చంద్రబాబు నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్నారు.