సీఎం జగన్పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. తల్లిని తిట్టినవారికి పదవులా?
అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఏర్పాటు, సంక్షేమ పథకాలపై చర్చ, కొత్త చట్టాల రూపకల్పన తదితర వ్యవహారాల్లో తలమునకలైన వైసీపీ ప్రభుత్వానికి తొలిసారి ఒకింత షాకింగ్ పరిణామం ఎదురైంది. సొంతపార్టీకే చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ కామెంట్లలో జగన్ తల్లి విజయమ్మ పేరు కూడా ప్రస్తావనకు రావడం మరింత కలకలంరేపింది.
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంగళవారం తనను కలిసిన కొందరి ముందు ఆవేదన వెళ్లగక్కారని, సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పార్టీనే నమ్ముకొని ఏళ్లతరబడి సేవలు చేసినవారికి సరైన ప్రాధాన్యం దక్కడంలేదని, టీడీపీ నుంచి జంప్ చేసి వచ్చినవాళ్లకు మాత్రం ఎక్కడలేని ప్రయారిటీ దక్కుతోందని ఆరోపించినట్లు కొన్ని చానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి.
గతంలో జగన్ను ఉరి తీయాలంటూ తీవ్రంగా దూషించిన ఆనం కుటుంబీకులు.. వైసీపీలో చేరగానే వారికి పదవులు దక్కాయని, జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రిగా కొనసాగుతోన్న బొత్స సత్యనాయరణ కూడా ఒకప్పుడు జగన్ తల్లి విజయమ్మను ఏకవచనంతో సంబోధించి అవమానించారని నల్లపురెడ్డి గుర్తుచేసినట్లు తెలిసింది.
పార్టీనే నమ్ముకున్నవాళ్లను పక్కనపెట్టి పక్కపార్టీల నుంచి వచ్చినవాళ్లకు జగన్ పదవులిస్తున్నారంటూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నట్లుగా ప్రసారమైన వార్తలపై వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. నెల్లూరు జిల్లా వైసీపీలో కొంత కాలంగా వర్గపోరు నడుస్తోందన్న వార్తలకు నల్లపురెడ్డి తాజా కామెంట్లు నిదర్శనమనే చర్చకూడా వినిపిస్తోంది.