కృష్ణా వరద ప్రవాహంలో స్తంభించిన పడవ: తృటిలో ఒడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే!
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న మర పడవ పోటెత్తిన కృష్ణానదిలో స్తంభించిపోయింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వెంట స్థానిక విలేకరులు, తెనాలి రెవెన్యూ అధికారులు, పోలీసులు, కొందరు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. దీనితో సర్వత్రా ఆందోళన నెలకొంది. కొద్దిసేపటి తరువాత- మరో పడవను తీసుకొచ్చి.. సురక్షితంగా ఒడ్డుకు తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం కొల్లిపర మండలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కృష్ణానదికి వరద పోటెత్తిన నేపథ్యంలో- తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లంక గ్రామాల్లో పర్యటనకు వెళ్లారు. మర పడవ సహాయంతో కొల్లిపర మండలంలో పొత్తూరు లంక, అన్నవరపు లంక గ్రామాలకు వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే వెంట తెనాలి పట్టణ ఎస్ఐ, రెవెన్యూ అధికారులు, తహశీల్దార్, స్థానిక విలేకరులు ఉన్నారు. ఆయా గ్రామాల ప్రజలను పరామర్శించిన అనంతరం కొందరు విద్యార్థులతో కలిసి అన్నాబత్తుని.. తెనాలికి బయలుదేరారు. నది మధ్యలోకి మర పడవ చేరుకున్న తరువాత అకస్మాత్తుగా స్తంభించిపోయింది.
దీనితో అందరిలో ఆందోళన వ్యక్తమైంది. ఆయన వెంట ఉన్న ఎస్ఐ తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెనాలి అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలియజేశారు. వెంటనే వారు నది వద్దకు చేరుకున్నారు. ఈలోగా రెవెన్యూ అధికారులు మరో పడవను సిద్ధం చేశారు. దాని సహాయంతో ఎమ్మెల్యేతో పాటు మిగిలిన వారందరినీ ఒడ్డుకు చేర్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారంతా గట్టెక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అన్నాబత్తుని శివకుమార్ తన పర్యటన కొనసాగించారు. వేరే లంక గ్రామాల్లో పర్యటించారు.