'గ్రీన్ జోన్ పేరుతో చంద్రబాబు మోసం.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది'
గ్రీన్ జోన్ పేరుతో కృష్ణా జిల్లాను చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. లక్ష కోట్లు అమరావతి నిర్మాణానికే పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజధానిపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి అందరు మద్దతుగా నిలవాలని కోరారు. గురువారం పెనమలూరులో అమ్మ ఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్థసారధి మాట్లాడారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. అమ్మ ఒడితో రాష్ట్రంలో డ్రాపౌట్స్ తగ్గి విద్యాభివృద్ది సాధిస్తుందన్నారు. భవిష్యత్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా విద్యా ప్రమాణాలు నెలకొల్పుతున్నామని చెప్పారు. పేద వర్గాలకు విద్య దూరం కావడం వల్లే ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయని, అమ్మ ఒడి లాంటి పథకాలతో అసమానతలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియంతో ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ రాద్ధాంతం సిగ్గు చేటన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. చంద్రబాబులా కాకుండా అధికారంలోకి రాగానే ఒక్కో హామీని జగన్ అమలుచేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ రైతుకు జగన్ రైతు భరోసా అందించారని చెప్పారు.
కాగా,గురువారం చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం ఏడాదికి రూ.15వేలు జమ చేస్తుంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఇది వర్తించనుంది. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లులు,80లక్షల పైచిలుకు విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి ఏకంగా రూ.6,500 కోట్లు కేటాయించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి చదువుకు దూరం కావద్దన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీపడి చదువుకుంటారని చిత్తూరులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.