‘బ్రీఫ్డ్ మీ’ అని చంద్రబాబు తెలుగును చంపేశారు: పవన్ కళ్యాణ్పైనా రోజా సెటైర్లు
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ చిత్తూరులో మాట్లాడుతూ మండిపడ్డారు.
పేద పిల్లలకు అక్కర్లేదా..
ఇంగ్లీష్ మీడియం చదువులను వ్యతిరేకిస్తున్న నేతలు.. వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియా స్కూళ్లలోనే చదివిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న నేతల పిల్లలు విదేశాలకు వెళ్లి మరీ చదుకుంటున్నారని, కానీ ఇక్కడి పేదల పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువులు అక్కర్లేదన్న విధంగా టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలుగును ఉద్దరిస్తారా?
టీడీపీ నేతలు తీరు బాధాకరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలో ఆ నేతలు ఉన్నట్లు కనబడుతోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీస్ మీడియం చదువులతో తెలుగు చచ్చిపోతుందనడం హాస్యాస్పదమన్నారు రోజా. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం, విదేశాల్లో చదివించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు.. తెలుగును ఉద్ధరిస్తారట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘బ్రీఫ్డ్ మీ' అని చంద్రబాబు తెలుగును చంపేశారు.. ఇక పవన్..
ఓ ఆడియో టేప్లో చంద్రబాబు నాయుడు ‘బ్రీఫ్డ్ మీ' అంటూ తెలుగు చంపేశారని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అని.. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారని అన్నారు. పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులో ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
ఇదే నిజమైన బాలల దినోత్సవం..
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. నవరత్నాల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల వసతులు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని రోజా చెప్పుకొచ్చారు. ఇదే నిజమైన బాలల దినోత్సవమని వ్యాఖ్యానించారు.