అలిగిన రోజాకు బంపర్ ఆఫర్: ఆ ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్కు ఛైర్పర్సన్గా..!
Recommended Video
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించిన నాయకుల్లో టాప్లో ఉండే పేరు ఆర్కే రోజా. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ రోజాకు హోమ్ మంత్రి పదవి ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. దీన్ని ఎవరూ ధృవీకరించలేదు. అలాగని ఎవరూ తోసి పుచ్చనూ లేదు. ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల జాబితా ఇదేనంటూ వాట్సప్లో ఓ అనధికారిక జాబితా కూడా విపరీతంగా ఫార్వర్డ్ అయ్యింది.
వైఎస్ను గుర్తు చేసిన జగన్ కేబినెట్... ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చాడంటే..!
మంత్రివర్గంలో అనూహ్య కూర్పు!
వెనుకా, ముందూ ఆలోచించకుండా దూసుకెళ్లిపోయే మనస్తత్వం ఉండే రోజాకు హోమ్ శాఖ అప్పగిస్తారనే సమాచారం చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తీరా మంత్రివర్గం ఏర్పాటయ్యే సరికి.. రోజాకు హోమ్ మంత్రి కాదు కదా.. అసలు చోటే దక్కలేదు. అంచనాలకు అందని విధంగా మంత్రివర్గ కూర్చును ప్రకటించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్ల పార్టీ అనే ముద్రను తొలగించుకోవడానికి ప్రయత్నించారాయన. తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు మంత్రివర్గంలో పరిమితంగా మాత్రమే చోటు కల్పించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన, సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు. కీలక శాఖలకు అప్పగించారు.
రోజా పరిస్థితేంటీ?
పార్టీలో సీనియర్ నేత రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ ఆమె పార్టీలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రోజా రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 2009 ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనితీరు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఆకర్షితురాలై కాంగ్రెస్లో చేరారు. అదే ఏడాది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆయన కుటుంబానికి అండగా నిల్చున్నారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు.
ఆర్టీసీ ఛైర్ పర్సన్గా
తనకు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు రోజా అలిగారని, అందుకే ఆమె పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారని అంటున్నారు. దీనితో ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా- రోజాకు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్పర్సన్గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్టీసీ ఛైర్పర్సన్ పదవి కోసం రోజా పేరు దాదాపు ఖాయమైందని సమాచారం. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పందేరానికి తెర తీసిన క్రమంలో- రోజాను ఆర్టీసీ ఛైర్పర్సన్ బాధ్యతలను అప్పగిస్తారని వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు.
టీటీడీ తరువాత ఆ స్థాయిలో..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నామినేటెడ్ పదవుల్లో ఆర్టీసీది రెండో స్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి తరువాత ఆ స్థాయిలో పలుకుబడి ఉన్న పోస్ట్ అది. ప్రయాణికుల రూపంలో రోజూ లక్షలాది మంది ప్రజలు, ఉద్యోగులు, కార్మికులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కార్పొరేషన్ ఆర్టీసీ. నిర్వహణలో ఏ మాత్రం లోటు పాట్లు తలెత్తినప్పటికీ.. దాని ప్రభావం వెనువెంటనే ప్రజలపై పడుతుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇలాంటి తప్పులెన్నో చోటు చేసుకున్నాయని, వాటిని సరిదిద్ది, సంస్థను గాడిన పెట్టగల సమర్థత రోజాకు ఉందని అంటున్నారు. ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టి, సంస్థ ఎదుర్కొంటున్న నష్టాలను తగ్గించడానికి అధికారులు రూపొందించే ప్రణాళికలను పక్కాగా అమలు కావడానికి రోజా ముక్కుసూటితనం సరిపోతుందని భావిస్తున్నారు.
రెండో మహిళగా..
అదే జరిగితే- ఆర్టీసీ ఛైర్పర్సన్గా నియమితులైన రెండో మహిళా రాజకీయ నాయకురాలవుతారు రోజా. ఇదివరకు దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను ఆర్టీసీ ఛైర్పర్సన్గా నామినేట్ చేశారు. విభజన తరువాత ఏర్పాటైన ఆర్టీసీకి తొలి మహిళా ఛైర్పర్సన్గా రోజా రికార్డు సృష్టిస్తారు.