మూడుదశల్లో రేషన్: ఎప్పుడెప్పుడంటే: పర్యవేక్షించిన రోజా..ఏపీలో నిత్యావసర సరుకుల పంపిణీ షురూ
తిరుపతి: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ ఆరంభమైంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం.. నిర్ణీత సమయానికి రేషన్ పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు చౌక ధరల దుకాణాల డీలర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ఆరంభమైన రేషన్ పంపిణీ సందర్భంగా రద్దీ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. రేషన్ షాపుల వద్ద ముందుగానే బాక్సులను గీశారు. అందులోనే నిల్చోవాల్సి ఉంటుందని మైక్ ద్వారా ప్రకటించారు.
Recommended Video
స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో..
ప్రతి రేషన్ షాపు వద్ద కూడా ఒకరు లేదా ఇద్దరు పోలీసులను విధుల్లో ఉంచారు. నిత్యావసర సరుకులను కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు తప్పనిసరిగా పర్యవేక్షించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలను జారీ చేశారు. దీనితో పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రేషన్ పంపినీని పర్యవేక్షించారు. కార్డుదారులు సామాజిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మూడు దశల్లో రేషన్ పంపిణీ..
భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- రాష్ట్రంలో కూడా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ పంపిణీ చేయాల్సి వస్తున్నందున..ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. కుటుంబానికి ఒకరు కంటే ఎక్కువ మంది రాకూడదని పోలీసుల హెచ్చరిస్తున్నారు.
మూడు దశల్లో రేషన్ పంపిణీ..
రాష్ట్రవ్యాప్తంగా కోటి 40 లక్షల మేర రేషన్ కార్డులకు దశలవారీగా రేషన్ అందనుంది. తెల్లరంగు రేషన్ కార్డు కలిగిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెల రోజుల వ్యవధిలో మూడు దశల్లో నిత్యావసర సరుకులను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివారం నాటితోో పాటు వచ్చే నెల 15, 29వ తేదీల్లో కూడా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ను అందజేయనుంది ప్రభుత్వం.
4వ తేదీన వెయ్యి రూపాయల ఆర్థిక సాయం..
వచ్చే 29వ తేదీ నాటికి ఉచితంగా రేషన్, కందిపప్పు, అయిదు కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు చొప్పున మొత్తం 15 కేజీల బియ్యం, మూడు కేజీలు కంది పప్పుతో పాటు కరోనా ప్యాకేజీలో భాగంగా వచ్చే నెల 4వ తేదీన గ్రామ వలంటీర్ల ద్వారా 1000 రూపాయల మొత్తాన్ని అందజేయనుంది. కరోనా వల్ల లాక్డౌన్ పరిస్థితులు తలెత్తడం, దినసరి వేతన కార్మికులు, రోజువారీ కూలీలకు ఆర్థిక భరోసాను కల్పించడంలో భాగంగా ప్రభుత్వం మొత్తాన్ని చెల్లించనుంది.
పర్యవేక్షించిన రోజా..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్కే రోజా ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గం నగరిలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద కలియ తిరిగారు. అధికారులు గీసిన బాక్సుల్లోనే నిల్చోవాలని సూచించారు. మాస్క్లను ధరించని వారిని హెచ్చరించారు. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలను తీసుకోవాలని ఆదేశించారు.