ఓవైపు బిల్లులపై ఉత్కంఠ.. మరోవైపు రోజా,బాలకృష్ణ సెల్ఫీలు.. మండలిలో ఆసక్తికర సన్నివేశం
అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుపై ఏపీ శాసనమండలిలో ఉత్కంఠతో కూడిన చర్చ జరుగుతున్నవేళ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బిల్లుల విషయంలో వైసీపీ,టీడీపీ మధ్య పెద్ద యుద్దమే నడుస్తున్నవేళ.. మండలిలో చోటు చేసుకున్న ఈ సన్నివేశం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ విషయమేంటంటే.. మండలి గ్యాలరీలో కూర్చున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగారు. అదే ఫ్రేమ్లో టీడీపీ అధినేత చంద్రబాబు సహా మరికొందరు నేతలు ఉన్నారు.
మొదట మండలి సమావేశాలను వీక్షించేందుకు చంద్రబాబు,పయ్యావుల కేశవ్ సహా మరికొందరు టీడీపీ నేతలు గ్యాలరీలోకి వచ్చి కూర్చున్నారు. కాసేపటికే రోజా కూడా గ్యాలరీలోకి వచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణను చూసి పలకరించిన ఆమె.. ఆయన పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. మండలిలో బిల్లులపై చర్చ,ఇతరత్రా అంశాలపై ఇద్దరు కాసేపు ముచ్చటించినట్టు సమాచారం. ఓవైపు బిల్లుల విషయంలో వైసీపీ,టీడీపీ మధ్య తీవ్ర మాటల యుద్దం నడుస్తుంటే.. ఇలా ఇరు పార్టీలకు చెందిన నేతలు చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, మండలి ఛైర్మన్ షరీఫ్ అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు,సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీలకు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసనసభలో స్పీకర్,శాసనమండలిలో ఛైర్మన్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. మండలిలో టీడీపీకే మెజారిటీ ఉంది కాబట్టి.. కమిటీలోనూ ఆ పార్టీ సభ్యులకే ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుంది. సెలెక్ట్ కమిటీ ప్రజాభిప్రాయం తెలుసుకుని.. బిల్లులో మార్పులు,చేర్పులను సూచిస్తూ అసెంబ్లీకి పంపిస్తుంది. అసెంబ్లీలో చర్చ,సవరణలు జరిగే అవకాశం ఉంటుంది. ఆపై మళ్లీ మండలికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందితే బిల్లు పాస్ అవుతుంది. లేదంటే మళ్లీ అసెంబ్లీకే పంపించి ఆమోదించుకుంటారు.