ఇదొక చేతకాని దద్దమ్మ ప్రభుత్వం.. 10కి.మీ దూరంలో ఉన్నవాన్ని పట్టుకోలేరా?: రోజా
విజయవాడ: దాచేపల్లి మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు సుబ్బయ్య టీడీపీ సభ్యుడు అని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. టీడీపీ పాలనలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నందుకు సీఎం చంద్రబాబు బావిలో దూకాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దాచేపల్లి ఘటనను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారనడాన్ని రోజా తప్పుపట్టారు. టీడీపీ వైఫల్యాలన్నింటిని వైసీపీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు తమ పోరాటం వల్లే సీఎం బాధితురాలిని పరామర్శించడానికి వచ్చారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అసమర్థ పాలనను కొనసాగిస్తోందని, అందుకే రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
చింతమనేనితో సెటిల్మెంట్లు చేస్తారా?
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై ఉన్న 800కేసులను ఎత్తివేయించారని రోజా అన్నారు. టీడీపీ నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే నిలదీయాల్సిందిపోయి ఇంటికి పిలిచి సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కాల్ మనీ వ్యవహారంపై వైసీపీ అసెంబ్లీలో నిలదీస్తే.. ఆ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ లు ఉన్నారన్న కారణంతో దానిపై సరైన విచారణ జరిపించలేదన్నారు. కాల్ మనీపై మాట్లాడినందుకే తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.
బయటకు రావాలంటే భయపడుతున్నారు
టీడీపీ పాలనలో ఆడవాళ్లు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని రోజా అన్నారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 11 అత్యాచార కేసులు నమోదయ్యాయని వారందరినీ ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. దాచేపల్లి బాధితురాలిని పరామర్శించినట్టే.. మిగతా బాధితులను ఎందుకు పరామర్శించరని నిలదీశారు.
దాచేపల్లి బాధితులకు వైసీపీ అండగా నిలిచిందని, ప్రజా చైతన్యంతోనే సీఎం దిగొచ్చారని రోజా అన్నారు. కథువా రేప్ ఘటనను ఖండించిన చంద్రబాబు.. ప్రధానిని రాజీనామా చేయాలని అన్నారని, మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలకు ఆయన రాజీనామా చేయరా? అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇంకా సీఎంగా కొనసాగే అర్హత ఉందా? నిలదీశారు.
ఇదొక చేతకాని దద్దమ్మ ప్రభుత్వం
దాచేపల్లి ఘటనలో 50ఏళ్ల వృద్దుడైన నిందితుడిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, 10కి.మీ దూరంలోనే ఉన్న నిందితుడిని పట్టుకోలేదంటే.. ఇదొక చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని రోజా విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, కేవలం టీడీపీ నాయకులకు కొమ్ము కాసేందుకు, వారి సభలు సమావేశాలకు కాపలా కాసేందుకే వారి పనిచేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ సీఎం అయితే మహిళలకు రక్షణ
మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు తన సొంత సోదరుడు సీఎం అయితే ఎలాంటి రక్షణ ఉంటుందో అలాంటి రక్షణ కల్పిస్తామని అన్నారు.