టిడిపి ఎంపీలను రాజీనామా చేసే వరకు తరిమికొట్టండి: రోజా
అమరావతి: పదవులకు రాజీనామాలు చేసేవరకు టిడిపి ఎంపీలను గ్రామాల్లోకి రాకుండా తరిమి తరిమి కొట్టాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు.టిడిపి నేతలు ప్రజల పక్షమో, పదవులు పక్షమో తేల్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.
Recommended Video
న్యూఢిల్లీలో వైసీపీ ఎంపీ ఆమరణ నిరహరదీక్ష శిబిరంలో రోజా సోమవారం నాడు ప్రసంగించారు.ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఆమె చెప్పారు. కానీ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎందుకు తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామాలు చేయించడం లేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామాలు చేయించే ధైర్యం చంద్రబాబుకు లేవా అని ఆమె ఎద్దేవా చేశారు.బిజెపి, టిడిపి నేతలకు ప్రజలు బుద్దిచెప్పేందుకు సిద్దంగా ఉన్నారని రోజా చెప్పారు. కేసుల భయంతోనే చంద్రబాబునాయుడు నాలుగేళ్ళుగా బిజెపితో ఉన్నారని రోజా ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో లాలూచీ పడితే ఢిల్లీలో ఎందుకు దీక్షలు చేస్తామని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తోంటే బిజెపితో కుమ్మక్కయ్యారని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో దీక్ష చేస్తున్న పార్టీ ఎంపీలకు మద్దతు తెలిపిన ఆమె.. ఎంపీలతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడారు
పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజయమ్మ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న సమయంలో టిడిపి నేతలు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకోవాలని విజయమ్మ ప్రజలను కోరారు.