కవల పిల్లలు: 'చంద్రబాబు సీఎం అయితే ఏపీలో కరువు తాండవం చేయాల్సిందే'
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కరువు కవల పిల్లలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాటలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు కవల పిల్లలని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రాష్ట్రానికి కరువు వస్తుందని దుయ్యబెట్టారు.
చంద్రబాబుకు కరువుపై ముందు చూపు లేదని విమర్శించిన రోజా ఉన్నదంతా మొండి చూపేనని అన్నారు. ఏపీలోని ప్రజలు కరువుతో అల్లాడుతుంటే వారిని గాలికి వదిలేసిన చంద్రబాబు... ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకే ఎక్కువ సమయం చూపుతున్నారని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న హెరిటేజ్ మజ్జిగ కేంద్రాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని ఆమె అన్నారు.