చంద్రబాబుకు ఓఎల్స్ఎక్స్ గతి: టీడీపీని అమ్ముకోవాల్సిందే: ఆ భయంతోనే..: రోజా
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. తన సామాజికి వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అడ్డుగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ఎన్నికలను వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. తమకు ఓటు వేయలేదనే అక్కసుతో రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.
ఓటమి భయంతో.. నిమ్మగడ్డను అడ్డు పెట్టుకుని..
దీనిపై ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో విడుదల చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వైఖరిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే- స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి అందాల్సిన 5000 కోట్ల రూపాయల నిధులను అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఓటమి భయంతో నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని కొత్త నాటకం ఆడారని, కుట్ర రాజకీయాలకు తెర తీశారని విమర్శించారు.
2018లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు నిర్వహించలేదంటూ..
ముఖ్యమంత్రిని గానీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను గానీ సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని ఆరోపించారు. తన విచక్షణాధికారాలతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ చెబుతున్నారని, 2018లో జరగాల్సిన ఈ ఎన్నికలను అవే విచక్షణాధికారాలను ప్రయోగించి ఎందుకు నిర్వహించలేకపోయారని ధ్వజమెత్తారు. తాను ప్రజా వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నాననే విషయం చంద్రబాబుకు తెలుసునని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించే ధైర్యం చేయలేకపోయారని ఆరోపించారు.
ఓఎల్ఎక్స్లో అమ్ముకునే పరిస్థితికి టీడీపీ..
ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీని ఓఎల్ఎక్స్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని రోజా వ్యాఖ్యానించారు. డబ్బు, మద్యం రహితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంటే.. దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారని, రమేష్ కుమార్ ద్వారా కుట్ర పూరితంగా వ్యవహరించారని విమర్శించారు. తమ పరిపాలన ప్రజలు ఆమోదించడాన్ని చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని ఆమె మండిపడ్డారు.
చట్టపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ..
చట్టపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ.. దాన్ని అధిగమించి తమ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధపడ్డారని, దాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వారా అడ్డుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని తాము ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ప్రజా కోర్టులో నిరూపిస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
Recommended Video
https://www.facebook.com/RojaSelvamani.Ysrcp/videos/196668638330981/