నారా లోకేశ్ చేస్తోన్న పాడుపనులకు 80 శాతం టీడీపీ నేతలు జైల్లో పడతారన్న ఎమ్మెల్యే రోజా.. అవేంటంటే..
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందినట్లేనంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారం.. మండలి చైర్మన్ ప్రకటన చేసిన 14 రోజుల్లోపు సెలెక్ట్ కమిటీలు ఏర్పాటుకావాలని, రాజధాని బిల్లుల విషయంలో అలా జరగలేదుకాబట్టి.. మండలిలో బిల్లులు ఆమోదం పొందినట్లుగానే భావించాలని ఆమె చెప్పారు. బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆలయ బయట మీడియాతో మాట్లాడారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను ఉద్దేశించి రోజా తీవ్రఆరోపణలు చేశారు.
బిల్లుల ఆమోదం నిజమేనా?
రాజధాని బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు విషయమై రాజకీయ రచ్చ కొనసాగుతుండగానే.. సీఎం జగన్ కు దగ్గరి వ్యక్తిగా పేరున్న ఎమ్మెల్యే రోజా బిల్లులు ఆమోదం పొందాయంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రూల్ 154 ప్రకారం సెలెక్ట్ కమిటీల ఏర్పాటు కుదరదంటూ సంబంధిత బిల్లును శాసన మండలి అధికారులు తిరిగి చైర్మన్ కు పంపడం వివాదాస్పదమైంది. ఆ రూల్ ప్రకారమే కమిటీలు ఏర్పాటుచేసే అధికారం చైర్మన్ కు ఉంటుందని, చైర్మన్ సూచనకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అధికారులు.. ప్రభుత్వానికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదని ప్రతిపక్ష బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విమర్శిస్తున్నారు. రాజధాని బిల్లులపై రోజా తప్ప వైసీపీకి చెందిన ఇతరులెవరూ ఈ తరహా ప్రకటన చేయలేదు.
జనం తరిమికొడతారు..
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని చూస్తుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఆ నిర్ణయానికి అడ్డుతగులుతున్నారని, కేవలం తన రియల్ ఎస్టేట్ కోసమే టీడీపీ చీఫ్ సంకుచితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సేవ్ అమరావతి ఉద్యమంలో భాగంగా చంద్రబాబు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర సిగ్గుమాలిన చర్య అని ఆమె పేర్కొన్నారు. మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తరిమికొడతారని చెప్పారు.
లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు
టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో, బయటా పెద్ద ఎత్తున బూతు ప్రచారం జరుగుతున్నదని, ఇతర పార్టీల నేతలే టార్గెట్ గా అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. లోకేశ్ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదులు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైళ్లలో పడతారని చెప్పారు. ఘోరమైన తప్పులు చేసినందుకే తండ్రీకొడుకుల్ని జనం చీత్కరించి మూలనపడేశారని, అయినాసరే బుద్ధి తెచ్చుకోకుండా దుష్ప్రచారాలు కొనసాగిస్తున్నారని ఆమె విమర్శించారు.
పక్కరాష్ట్రాలకూ జగన్ ఆదర్శం
ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తోన్న రైతు భరోసా, అమ్మఒడి, మహిళల రక్షణ కోసం ‘దిశ' చట్టం తదిర మంచిపనుల్ని పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని, ఒక్క చంద్రబాబు మాత్రమే ప్రతిదానిపై రాజకీయాలు చేస్తూ సొంతలాభం కోసం ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, దేవుడి దయతో ఏపీలో జగన్ పాలన జనరంజకంగా సాగుతుందని, మూడు రాజధానులు ఏర్పాటయితీరుతాయని ఆమె చెప్పారు.