ఫోటో రాజకీయం: టీడీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయంటూ రోజా ఘాటు వ్యాఖ్య
హైదరాబాద్: నగరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ లాంఛ్లో వైయస్ చిత్రపటాన్ని తొలగించడంపై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైయస్ చిత్రపటాలున్న ప్లకార్డులను పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు.
వైయస్ ఫోటో తొలగింపుపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విపక్ష సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు పాయింట్ వద్ద యనమల వ్యాఖ్యలపై స్పందించిన రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘వైఎస్ ఫొటో చూస్తే టీడీపీ నేతల పంచెలు తడిసిపోతున్నట్టున్నాయి. అందుకే ఆయన ఫొటో తీసేశారు. అసెంబ్లీ లాంఛ్లో స్వర్గీయ నందమూరి తారకరారావు ఫొటోను పెట్టడం ఇష్టం లేకనే వైఎస్ ఫొటోను తీసేశారు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
మరోవైపు అసెంబ్లీ లాంఛ్లో ఉన్న వైయస్ ఫోటోను ఎవరికీ చెప్పకుండా తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ మానవతావాదిగా గుర్తింపు పొందిన వైయస్ ఫోటోను తొలగించడం దారుణమన్నారు.
తక్షణమే యధాస్ధానంలో ఆయన ఫోటోను పెట్టాలని డిమాండ్ చేశారు. వైయస్ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే కరువు కోరల నుంచి రాష్ట్రం బయట పడుతుందన్నారు. కరువు పరిస్థితులపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరువు, తాగునీటి సమస్య, ఆత్మహత్యలపై చర్చించేందుకు వైసీపీ బుధవారం నాడు వాయిదా తీర్మానం ఇచ్చింది.
సభ ప్రారంభమైన వెంటనే కరవు, రైతు ఆత్మహత్యలు, తాగునీటి సమస్యపై వైకాపా ఇచ్చిన వాయిదాతీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.