"ఆ భయంతోనే చంద్రబాబు లోకేష్ కు మంత్రిపదవి ఇవ్వట్లేదు!"
అఖిలేష్ తరహాలోనే ఇక్కడ లోకేష్ కూడా తనను ఎక్కడ గద్దె దింపుతాడోనన్న భయంతోనే.. ఇంతవరకు లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టలేదని రోజా ఆరోపించారు.
తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనంతా మూడు మోసాలు, ఆరు అబద్దాలుగా సాగుతోందని విమర్శించారు. ఏటా క్యాలెండర్ మారుతుందే తప్పా.. చంద్రబాబు తీరు మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు.
ఇక యూపీ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. చంద్రబాబుకు అదే భయం పట్టుకుందన్నారు రోజా. ఉత్తరప్రదేశ్ లో ములాయం-అఖిలేష్ రాజకీయాలు చూసి చంద్రబాబుకు బీపీ వచ్చిందన్నారు. అక్కడ అఖిలేష్ తరహాలోనే ఇక్కడ లోకేష్ కూడా తనను ఎక్కడ గద్దె దింపుతాడోనన్న భయంతోనే.. ఇంతవరకు లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టలేదని రోజా ఆరోపించారు.
లోకేష్ తననెక్కడ సీఎం కుర్చీ నుంచి దించుతాడోనన్న భయంతోనే లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారని విమర్శించారు. పులివెందులకు ఈ నెల 11 నుంచి నీళ్లు అందిస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు లేవన్న చంద్రబాబు ఇక పులివెందులకు నీళ్లు ఇస్తారంటే జనం నమ్ముతారా? అని ప్రశ్నించారు.
నిధులు, ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.