ఢిల్లీలో తోకముడిచిన బాబు, ప్రెస్ మీట్ లేకుండా పారిపోయారు, ఈ ఫోటో చూపించి నిలదీయండి: రోజా
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం నిప్పులు చెరిగారు. అలాగే, తాను పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తాననే ప్రచారంపై కూడా ఆమె తీవ్రంగా స్పందించారు. తాను పవన్ పార్టీలోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీని అక్కడా కొడదాం: చంద్రబాబు సరికొత్త వ్యూహాలు! దానికి కాంగ్రెస్ మద్దతు
ఆదివారం నాటి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు చాలా చనువుగా మెలిగారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు ఎలా తాకట్టు పెడుతున్నారనే విషయం నిన్నటి నీతి ఆయోగ్ సమావేశంతో మరోసారి రుజువైందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానంటూ అమరావతిలో బీరాలు పలికారన్నారు.
మోడీ ముసిముసి నవ్వు, చంద్రబాబు వెకిలి నవ్వు
ప్రత్యేక హోదా, విభజన హామీలపై నిలదీస్తానని చెప్పిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాక తోక ముడిచారని రోజా మండిపడ్డారు. ముసిముసిగా నవ్వుతూ మోడీ, వెలికిగా నవ్వుతూ చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారని చెప్పారు. వంగివంగి నమస్కారాలు పెట్టడం చూస్తుంటే ఏపీ ప్రజలు నిర్ఘాంతపోయారన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాలను ఏపీ ప్రజలు అందరూ చూస్తున్నారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
ప్రగల్భాలు పలికి తోకముడిచారు
ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు ఢిల్లీలో ఎలా తాకట్టు పెట్టారో రుజువైందని, ఢిల్లీకి వెళ్లి భూకంపాన్ని సృష్టిస్తానని చెప్పిన ఆయన తన మీడియాలో తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు, అక్కడకు వెళ్లి తోక ముడిచి పారిపోయారని రోజా అన్నారు. ఈ రోజు జగన్ బీజేపీతో లాలూచీపడ్డారని తన మీడియాలో చంద్రబాబు బురద జల్లుతున్నారని, కానీ నీతి ఆయోగ్లో సీఎం ఏం చేశారో చూస్తే అర్థమవుతోందన్నారు.
ఒలింపిక్స్ వంగి నమస్కారాలు పెట్టే పోటీలో చంద్రబాబుకు ఫస్ట్ ప్రైజ్
ఇక్కడ (ఏపీలో) మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారని నాలుగేళ్ల తర్వాత గుర్తుకు వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడారని, నీతి ఆయోగ్ బహిష్కరిస్తామని చెప్పారని లేదంటే నిలదీసి రాష్ట్రానికి రావాల్సినవి తీసుకు వస్తానని చెప్పారని రోజా అన్నారు. కానీ చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూస్తుంటే ఒలింపిక్స్లో వంగి నమస్కారాలు పెట్టే పోటీ పెడితే చంద్రబాబుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు.
Recommended Video
షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడే ఎందుకు అడగలేదు
నాలుగేళ్లుగా ఎన్డీయేలో ఉండి, అధికారం అనుభవించి, ఓటుకు నోటులో దొరికిపోయి, అవినీతితో రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై రోజా మండిపడ్డారు. తనపై అవినీతి కేసులు విచారణకు రాకుంటే చాలని చంద్రబాబు అనుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి అన్యాయం చేసిందని చెబుతున్నారని, ఇటీవల ఢిల్లీలో ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు వెళ్లి ముందే మీడియాకు చెప్పి అరెస్టు డ్రామాలు ఆడారన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు.. మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలోనే హోదా, విభజన హామీలపై గట్టిగా ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కానీ ఎప్పటిలాగే తాను రాసుకెళ్లిన నార్మల్ స్క్రిప్ట్ చదివారన్నారు. కానీ ప్రత్యేక హోదా, ప్యాకేజీ, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ గురించి మాట్లాడలేదన్నారు.
జాతీయ మీడియా కూడా చంద్రబాబును తప్పుబట్టింది
మోడీకి షేక్ హ్యాండ్ ఇస్తూ చంద్రబాబు వెకిలి నవ్వు నవ్విన ఫోటో బయటకు రాగానే ప్రజలు ఆయన తీరును అర్థం చేసుకున్నారని రోజా చెప్పారు. ఇప్పుడు జాతీయ మీడియా కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టిందని, అందుకే నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పారిపోయారన్నారు. నీతి ఆయోగ్ను బహిష్కరించాలన్న నలుగురు సీఎంలు మోడీని చూడగానే నమస్కరించారని, నవ్వుతూ సరెండర్ అయిపోయిన విషయం కళ్లారా చూశామన్నారు.
ఈ ఫోటో చూపించి నిలదీయండి
బీజేపీ, టీడీపులు కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు చేస్తూ, ఏపీకి ఎలా అన్యాయం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని రోజా అన్నారు. ఎక్కడికి అక్కడ టీడీపీ వాళ్లు ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ధర్మపోరాటం అని వస్తే ఈ ఫోటో చూపించి మీరు చేసే వెకిలి చేష్టలు ఏమిటి, మీరు ప్రజలకు చేయాల్సింది ఏమిటి, విభజన హామీల గురించి అడగకుండా ఏం చేశారని నిలదీసి తరిమి కొట్టాలని రోజా సూచించారు.