వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా.. గుంటూరులో ‘రెండో దశ’ అలర్ట్.. సీఎం జగన్ ఆదేశాలతో సీరియస్గా..
గుంటూరు సిటీ మంగళదాసునగర్లో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారే ఉలిక్కిపడింది. సదరు బాధితుడు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని తేలడం, వైరస్ నిర్ధారణకు ముందు అతను భారీ విందులో పాల్గొనడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు ఈనెల 18న ఢిల్లీ నుంచి ఏపీకి రైలులో ప్రయాణం చేశాడు. జనతాకర్ఫ్యూ రోజైన ఆదివారం 500 మందితో కలిసి విందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించడంతో మంత్రులు హుటాహుటిన గుంటూరుకు పరుగులు తీశారు.
మంత్రి వార్నింగ్..
ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, మేకతోటి సుచరిత గుంటూరు అధికారులతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నదని, ఈ విషయంలో ప్రస్తుతం ఏపీ రెండో దశలో ఉందని, పొరపాటున మూడో దశకు చేరితే పరిస్థితులు చేయిదాటే ప్రమాదముందని మంత్రి నాని హెచ్చరించారు. అది జరగొద్దంటే ప్రజలంతా లాక్డౌన్కు సహకరించి, ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని కోరారు.
అనుమానితుల జాబితా.. అప్రమత్తత..
బాధితుడిని గుంటూరు నుంచి విజయవాడకు తరలించినప్పటికీ , జిల్లాలో బయటపడ్డ తొలి కేసే రాజకీయ నేత బంధువు, హైప్రొఫైల్ వ్యాపారిది కావడం, అతనికి సిటీ ప్రముఖులతోనూ దగ్గరి సంబంధాలుండటంలో అధికారులు అనుమానితుల జాబితాను తయారు చేశారు. పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారిలో కిందరిని ఐసోలేషన్ కు తరలించారు. అతను ఢిల్లీలో పాల్గొన్న సమావేశానికి కూడా పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారని, ఆయా వ్యక్తుల వివరాలు సేకరించి, సమాచారం అందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటిదాకా గుంటూరు జిల్లాలో 34 మందికి పరీక్షలు నిర్వహించగా, ఒక పాజిటివ్, 22 మందికి నెగటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 11 మంది రిపోర్టులు రావాల్సిఉంది.
3 కిలోమీటర్ల మేర హైపో క్లోరైడ్..
కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసిన తర్వాత గుంటూరు సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రజల్లో భయాందోళనలు పెరుగుతుండటంతో కార్పొరేషన్ అధికారులు నివారణ చర్యలకు ఉపక్రమించారు. బాధితుడి నివాస సముదాయం నుంచి మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. ఫైరింజన్ల ద్వారా.. సుమారు 40 కాలనీల్లోని ఇళ్లు, దుకాణాలపై సోడియం హైపో క్లోరైడ్, బ్లీచింగ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
పెరుగుతోన్న కేసులు..
మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. శుక్రవారం విశాఖలో మరో వ్యక్తికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అతను బర్మింగ్హామ్ నుంచి వచ్చిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. దీంతో ఏపీలో పాజిటివ్ కేసులు 12కు చేరాయి.